ట్రాఫిక్ జామ్ తో ఉక్కిరిబిక్కిరి అయ్యే బెంగళూరు మహానగరం కాస్త ఊపిరిపీల్చుకోనుంది. వచ్చేనెల 10వ తేదీనుంచి నగరంలో హెలికాఫ్టర్ రైడ్ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. బెంగళూరు సిటీ- కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం మధ్య చాపర్ సేవల్ని ప్రారంభించనుంది బ్లేడ్ ఇండియా. వచ్చేనెలలో ఈ హెలికాఫ్టర్ రైడ్ సర్వీసులు ప్రారంభం కానున్నాయి.
సిలికాన్ వ్యాలీగా పేరొందిన నగరానికి నిత్యం దేశవిదేశాలనుంచి వస్తుంటారు. జనాభా కూడా కోటికి పైగే. ఏ మూల చూసినా గంటలపాటు ట్రాఫిక్ జాం అవుతుంది. మెట్రోసర్వీసులు అందుబాటులో ఉన్నా…ట్రాఫిక్ రద్దీతో ప్రయాణికులు ఇబ్బంది పడుతూనే ఉంటారు. ఇక ఆఫీసులకు, అత్యవసర మీటింగులకు వెళ్లేవారు ఇబ్బందిపడుతున్న ఘటనలెన్నో. దీంతో వాళ్ల సమస్యలు తీర్చే మరో పరిష్కారమార్గంతో ముందుకు వచ్చింది అర్బన్ ఎయిర్ మొబిలిటీ సంస్థ బ్లేడ్ ఇండియా. బెంగళూరు సిటీ- కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం మధ్య ట్రాఫిక్ లేని వేగవంతమైన ప్రయాణం కోసం ఛాపర్ సేవలను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ 10 నుండి హెలికాఫ్టర్ రైడ్ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. వారానికి ఐదురోజులు సేవలు అందుబాటులో ఉంటాయి. H125 DVG ఎయిర్బస్ హెలికాప్టర్.. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ విమానాశ్రయం- బెంగళూరు విమానాశ్రయం మధ్య ఒకేసారి ఐదు నుండి ఆరుగురు ప్రయాణికులతో ప్రయాణించగలదు. దీంతో ఇప్పుడు బెంగుళూరు ఎయిర్ పోర్ట్ నుంచి సిటీకి చేరుకోవడానికి ప్రయాణ సమయం కూడా ప్రస్తుతాని కంటే 15 నిమిషాలకు తగ్గనుంది.