తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ని శ్రావణ మాసం లో ఎక్కువ మంది భక్తులు దర్శించుకుంటారు. అలాగే వచ్చే బ్రహ్మోత్సవాల లో కూడా యాత్రికుల తాకిడి ఎక్కువ. దీనిని దృష్టిలో పెట్టుకుని తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్యమైన సూచన చేస్తున్నది. తిరుమల కొండమీద నీటి నిల్వలు పరిమితంగా ఉన్నాయని ముందుగానే హెచ్చరిస్తున్నది. అందుచేత తిరుమల వచ్చే భక్తులు నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచన చేస్తోంది . ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలను పరిగణలోకి తీసుకుని ,, అదే మాదిరిగా భక్తుల సంఖ్య ను దృష్టిలో పెట్టుకుని తిరుమల తిరుపతి దేవస్థానం ఈ మేరకు ఒక ప్రత్యేక సూచన పత్రం జారీ చేసింది. ఈ సీజన్ లో తిరుమల కొండ మీద తక్కువ వర్షపాతం కారణంగా
తిరుమలలోని స్థానికులు మరియు యాత్రికుల నీటి అవసరాలను తీర్చడానికి కొంత ఇబ్బంది ఉంది. తిరుమలలోని ఐదు ప్రధాన డ్యామ్లలో లభ్యమయ్యే నీరు రాబోయే 120-130 రోజుల అవసరాలకు మాత్రమే సరిపోతుంది అని టీటీడీ పేర్కొంది.
తిరుమల కొండమీద నీటి వినియోగం లెక్కలు ఇలా ఉన్నాయి.తిరుమలలో ప్రతిరోజూ దాదాపు 43 లక్షల గ్యాలన్ల నీటిని వినియోగిస్తున్నారు. అందులో 18 లక్షల గాలన్లు తిరుమల డ్యామ్ల నుండి మిగిలిన నీరు తిరుపతిలోని కళ్యాణి డ్యామ్ నుండి సేకరిస్తారు . తిరుమలలోని గోగర్భం, ఆకాశ గంగ, పాప వినాశనం, కుమారధార, పసుపుధార డ్యామ్ల మొత్తం నిల్వ సామర్థ్యం 14,304 లక్షల గ్యాలన్లు కాగా, ప్రస్తుతం తిరుమలలో కేవలం 5,800 లక్షల గ్యాలన్ల నీరు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
అక్టోబరు 4 నుంచి 12 వరకు జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలకు భక్తులు పోటెత్తుతారు. యాత్రికుల రద్దీ దృష్ట్యా, నీటి వృథాను అరికట్టాలని, అలాగే నీటి వినియోగాన్ని నియంత్రించేందుకు కొన్ని చర్యలు తీసుకోవాలని భక్తులతో పాటు స్థానికులకు విజ్ఞప్తి చేస్తోంది.
తిరుమల కొండ మీద ఇందుకు సంబంధించి కొన్ని పోస్టర్లు ఏర్పాటు చేయాలని టిటిడి నిర్ణయించింది.