ఈ టైటిల్ నిజంగానే నిజం. భారతీయ సమాజంలో ఐకాన్ గా నిలిచే న్యాయదేవత ఇప్పుడు కళ్ళు తెరిచినది. న్యాయస్థానాలలో కళ్లకు గంతలు కట్టుకుని కనిపించే న్యాయదేవత విగ్రహంలో కొన్ని మార్పులు చేశారు. ఇకనుంచి న్యాయదేవత కళ్ళకు ఉండే గంతలను తొలగించారు.
ఈ మార్పుకు స్వయంగా సుప్రీంకోర్టులోనే శ్రీకారం చుట్టారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ఆదేశాలతో సుప్రీం కోర్టులో కొత్తగా న్యాయదేవత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
అత్యున్నత ధర్మాసనంలో ఏర్పాటు చేసిన న్యాయదేవత విగ్రహం కళ్లకు గంతలు లేకపోవడంతో ఈ అంశం వార్తల్లో నిలిచింది. అంతేకాదు.. ఇన్నాళ్లూ న్యాయ దేవత రెండు చేతుల్లో.. కుడి చేతిలో న్యాయానికి ప్రతిబింబంగా నిలిచే త్రాసు, ఎడమ చేతిలో ఖడ్గం ఉండేవి. సుప్రీం కోర్టులో కొత్తగా ఏర్పాటు చేసిన న్యాయ దేవత విగ్రహం ఎడమ చేతిలో ఖడ్గానికి బదులుగా రాజ్యాంగం ఉండటం గమనార్హం.
జడ్జిలతో చర్చించి ప్రధాన న్యాయమూర్తి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
సుప్రీం కోర్టులోని జడ్జీల లైబ్రరీలో ఈ విగ్రహాన్ని ఉంచారు. న్యాయం గుడ్డిది కాదని, చట్టానికి కళ్లున్నాయని బలమైన సంకేతమిచ్చే ఉద్దేశంతోనే న్యాయదేవత విగ్రహంలో సుప్రీం కోర్టు ఈ మార్పులుచేర్పులు చేసింది. అయితే ఇన్నాళ్లూ న్యాయదేవత విగ్రహం కళ్లకు గంతలు కట్టడం, చేతిలో ఖడ్గం ఉంచడం వెనక కారణం లేకపోలేదు.
”చట్టం ముందు అందరూ సమానమే.. న్యాయస్థానం డబ్బు, అధికారం.. ఇతర హోదాను చూడదు” అనే సందేశమిచ్చేందుకే న్యాయదేవత విగ్రహం కళ్లకు గంతలు కడతారు. ఇక.. చేతిలో ఉంచే ఖడ్గం విషయానికొస్తే.. అన్యాయాన్ని న్యాయదేవత చీల్చిచెండాడుతుందని సంకేతం ఇచ్చేందుకు ఇలా న్యాయదేవత విగ్రహం చేతిలో ఖడ్గాన్ని ఉంచారు.
అయితే అప్పటి బ్రిటిష్ పాలన సమయంలో పరిస్థితుల్లో కారణంగా దీనిని రూపొందించారు.
బ్రిటీష్ ఛాయల నుంచి భారతదేశ న్యాయ వ్యవస్థ బయటపడాలనే ఉద్దేశంతో పాటు.. చట్టం గుడ్డిది కాదని, రెండు కళ్లు తెరిచి అందరినీ సమానంగానే చూస్తుందని చాటి చెప్పే ఉద్దేశంతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయించినట్టు సమాచారం. మొత్తం మీద న్యాయదేవత కొత్త రూపం ఇప్పుడు చర్చనీయాంశం గా మారింది.