గిరిజన యోధుడు బిర్సాముండాకు భారతరత్న ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ ప్రముఖ రచయిత తుహిన్ ఎ. సిన్హా ప్రధానికి లేఖరాశారు. గిరిజన విప్లవకారుడైన బిర్సాముండా 1900 సంవత్సరంలో బ్రిటిష్ సైనికులకు వ్యతిరేకంగా పోరాడారు. ఆయనకు భారత రత్న ఇవ్వడంతో పాటు… జార్ఖండ్లోని దొంబారి హిల్స్లో యుద్ధ స్మారత చిహ్నాన్ని ఏర్పాటు చేయాలనీ కోరారు.
అంకితా వర్మతో కలిసి రచించిన ‘ది లెజెండ్ ఆఫ్ బిర్సా ముండా’ పుస్తకావిష్కరణ ఈమధ్యే జరిగింది.
బిర్సా ముండా జీవితాన్ని విస్తృతంగా పరిశోధించారు సిన్హా. జార్ఖండ్ అభివృద్ధి ప్రణాళికలలో బిర్సా ముండా కనిపించాలని ఆకాంక్షించారు. స్థానికులకు ఉపాధి అవకాశాలను కల్పించే బిర్సా టూరిజం కారిడార్ను రూపొందించాలని సూచించారు. ‘షెడ్యూల్డ్ ట్రైబ్’ ను ఆదివాసీకి బదులుగా వనవాసీగా మార్చాలని కోరారు.
2024లో బిర్సాముండా 150 వ జయంతి వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా జార్ఖండ్ వీరుడి త్యాగాన్ని దేశానికి తెలియచెప్పాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. బిర్సా ముండా వారసులమైన తమకు అన్యాయం జరుగుతోందని స్థానికులు అసంతృప్తిలో ఉన్నారని… ఖనిజ వనరులు, విస్తారమైన అటవీ విస్తీర్ణం ఉన్న రాష్ట్రాన్ని పారిశ్రామికీకరణ పేరుతో నాశనం చేస్తున్నారనే అభిప్రాయం ఉంది.
1940 ప్రాంతంలో అంతర్జాతీయంగా ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసి బ్రిటీష్ వారిపై నేతాజీ యుద్ధం చేస్తే అంతకునాలుగు దశాబ్దాల ముందే ఆ పనిచేశారు బిర్సాముండ అని సిన్హా అన్నారు.
కాశీ ఎలాగైతే హైందవ సంస్కృతికి సంగమంగా మారితే… బిర్సా ముండా దేశవ్యాప్తంగా అన్ని గిరిజన సంస్కృతులు, గిరిజన స్వాతంత్య్ర ఉద్యమాల్ని ఏకం చేశారు. అలాంటి బిర్సా ముండా దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నకు అన్నివిధాలా అర్హుడు అని సిన్హా ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు.
తుహిన్ సిన్హా పుస్తకం ‘ది లెజెండ్ ఆఫ్ బిర్సా ముండా’ త్వరలోనే అన్ని భారతీయ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఇండిక్ అకాడమీ సహకారంతో, రాంచీకి సమీపంలోని బిర్సా ముండా గ్రామమైన ఉలిహటుకు వెళ్లి ఆయన వంశానికి చెందిన వారసులకు 50 కాపీలను అందజేయాలనుకుంటున్నారు. బిర్సాముండా వంశస్తులు ఇప్పటికీ దుర్బరజీవనం గడుపుతున్నారు. వారి పూర్వీకుల గొప్పతనం గురించికూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. అయితే బిర్సాముండాకు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ ఆయన గ్రామంనుంచి మొదలై దేశవ్యాప్తంగా సంచలనం కావాలని కోరుకుంటున్నానని పలు సందర్భాల్లో చెప్పారు సిన్హా.