గురువారం GHMC హయత్ నగర్ లో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహా తయారీదారుల సమావేశాన్ని బహిష్కరించారు గణేశ్ విగ్రహాల తయారీదారులు. అనంతరం భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో హయత్నగర్ లోని కర్నాటి గార్డెన్ నుంచి హయత్ నగర్ పోలీస్ స్టేషన్ వరకూ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసన ర్యాలీలో VHP రాష్ట్ర అధ్యక్షులు M. రామరాజు, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కార్యదర్శి రావినూతల శశిధర్, BGUS ఎల్.బి.నగర్ అసెంబ్లీ కో–కన్వీనర్లు M . వెంకన్న, K. శ్రీధర్ రెడ్డి లతో పాటు పెద్ద ఎత్తున విగ్రహ తయారీదారులు పాల్గొన్నారు .
గణేష్ విగ్రహా తయారీదారులపై GHMC వేధింపులకు పాల్పడితే సహించేది లేదని సమితి కార్యదర్శి రావినూతల శశిధర్ హెచ్చరించారు. అధికారులు చట్ట ప్రకారం పనిచేస్తున్నారా ? లేదంటే AIMIM ఆదేశాల ప్రకారం పని చేస్తున్నారా? అని ప్రశ్నించారు. హిందూ వ్యతిరేక ఎజెండాలో భాగంగానే భాగ్యనగర్ లో ఘనంగా నిర్వహించే గణేష్ ఉత్సవాలను ఆపాలని కొన్ని హిందూ వ్యతిరేక శక్తులు కుట్రలు పన్నుతున్నాయని వీటిని సమాజం తిప్పికొడుతుందని అన్నారు. రాష్ట్ర హైకోర్టు ముందు GHMC అధికారులు ఉద్దేశపూర్వకంగానే వాస్తవాలు వెల్లడించలేదని ఇప్పటికైనా తగు న్యాయపరమైన చర్యలు చేపట్టి భాగ్యనగర్ ప్రతిష్టను కాపాడాలని, హిందువులను రెచ్చగొట్టే చర్యలు GHMC అధికారులు మానుకోవాలనీ కోరారు.పోలీసులను అడ్డంపెట్టుకొని గణేష్ విగ్రహ తయారీదారులను బెదిరించే చర్యలు GHMC అధికారులు ఆపకుంటే గనుక BGUS ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిస్తుందనీ హెచ్చరించారు.