లుథియానా కోర్టు పేలుళ్ల కేసులో ప్రమేయం ఉందని అనుమానిస్తున్న సిఖ్ ఫర్ జస్టిస్ SFJ కీలక సభ్యుడు జస్విందక్ సింగ్ ముల్తానీని జర్మనీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ, ముంబై సహా ప్రధాన నగరాలు లక్ష్యంగా పేలుళ్లకు కుట్ర పన్నినట్టు అతనిపై ఆరోపలున్నాయి.
పాకిస్తాన్ తో సంబంధాలున్న ఈ ఖలిస్థాన్ అనుకూల తీవ్రవాదిని అరెస్ట్ చేయాలన్న భారత ప్రభుత్వ అభ్యర్థనతో సెంట్రల్ జర్మనీలోని ఎర్ఫర్ట్ నుండి ఫెడరల్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.
ముల్తానీ ఎస్ఎఫ్ జే వ్యవస్థాపకుడు గురుపత్వంత్ సింగ్ పన్నుకు సన్నిహితుడు. పన్ను తరచూ భారత వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తుంటాడు. తన ప్రసంగాలతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కులను రెచ్చగొడుతుంటాడు.
ముల్తానీ ఖలిస్తానీ నాయకులైన హర్దీప్ సింగ్ నిజ్జెర్, పరమజిత్ సింగ్ పమ్మా, సబీ సింగ్, కుల్వంత్ సింగ్ మోతాడ వంటివారితో నిత్యం టచ్ లో ఉంటాడు. పాకిస్తాన్ నుంచి పంజాబ్ కు ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్మగ్లింగ్ చేసినట్టు ఆరోపణలున్నాయి. 45 ఏళ్ల ముల్తానీ హోషియాపూర్లో ఉండేవాడు. అప్పుడే పాకిస్తానీ మిత్రుల సాయంతో అక్కడి నుంచి హ్యాండ్ గ్రనేడ్లు, పేలుడు పదార్థాలు, పిస్టళ్ల వంటి మారణాయుధాలు తీసుకువచ్చాడని… వాటితో పంజాబ్ లో ఉగ్రవాద దాడులకు ప్లాన్ చేస్తున్నాడని తేలింది.
అత్యున్నత దౌత్యస్థాయుల్లో మోదీ సర్కారు జర్మనీ అధికారులను సంప్రదించింది. ఢిల్లీ,ముంబై నగరాలను లక్ష్యంగా ముల్తానీ పన్నుతున్న కుట్ర గురించి ఆ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. డిసెంబర్ 23న లూథియానాలోని జిల్లా కోర్టు పేలుడు ఘటనలో ఇద్దరు చనిపోగా గాయపడిన ఆరుగురికి గాయాలైన సంగతి తెలిసిందే.
గతేడాది ఫిబ్రవరిలో అమృత్సర్, తరన్ తరణ్, ఫిరోజ్ పూర్ కు చెందిన నలుగురిని పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారినుంచి పెద్దఎత్తున మారణాయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలో ఉగ్రవాద కార్యకలాపాల కోసమే వాటిని సమకూర్చుకుంటున్నట్టు పోలీసులు నిర్థారించారు.
ఆ తరువాత జీవన్ సింగ్ అనే వ్యక్తినీ పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియా ద్వారా ముల్తానీ తీవ్రవాదాన్ని ప్రచారం చేసేవాడు. రైతు నాయకుడు బల్బీల్ సింగ్ రాజేవాల్ ను లక్ష్యంగా చేసుకోవాలని ఇతనికి సూచించారు. అందుకోసమే మారణాయుధాల కోసం పెద్దమొత్తంలో డబ్బులు పంపినట్టు తెలుస్తోంది. రెండు హ్యాండ్ గ్రనైడ్లు వాడేందుకు ఆగస్టులో తరణ్ కు చెందిన ఓ వ్యక్తిని ప్రత్యేకంగా రిక్రూట్ చేసుకున్నాడు ముల్తానీ. రైతు సంఘాలన్నీ ఏకమై ఏర్పడిన పార్టీ తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా రాజేవాల్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే.
నవంబర్లో బ్రిటిష్ పోలీసులు …SJF హౌన్స్ కార్యాలయంపై దాడులు నిర్వహించారు. ఈ దాడిలో ‘రెఫరెండం 2020’కి సంబంధించిన ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇతర పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అదే నెలలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA)…ఆ సిక్కు సంస్థను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని కెనడాను కోరింది.
కోర్టు కాంప్లెక్స్లో పేలుడు పదార్థాన్ని అమర్చడానికి ప్రయత్నిస్తూ లూథియానా పేలుడులో మరణించిన డిస్మిస్డ్ హెడ్ కానిస్టేబుల్ గగన్దీప్ సింగ్కు ఖలిస్తాన్ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయని పంజాబ్ డీజీపీ సిద్ధార్థ్ చటోపాధ్యాయ ఇటీవలే తెలిపారు. లూథియానాలో జరిగిన పేలుళ్లలో పాకిస్థాన్కు చెందిన కార్యకర్తలు ప్రమేయం ఉండవచ్చని ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు.