కేరళ అసెంబ్లీ ఎన్నికలు మతపరంగా హీటెక్కిస్తున్నాయి. ఓ వైపు పినరయ్ సర్కార్ మరోసారి అధికారం చేపట్టేందుకు ఉవ్విల్లూరుతుండగా.. ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలని అటు బీజేపీ కూడా ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఇక్కడ పినరయ్ సర్కార్పై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పినరయ్ హయాంలో లవ్ జిహాద్ కేసులు పెరిగాయని.. ఉద్దేశ పూర్వకంగా ముస్లిం యువకులు హిందూ, క్రైస్తవ యువతులను ప్రేమే పేరుతో పెళ్లి చేసుకుంటూ మతం మారుస్తున్నారని ఆరోపిస్తోంది. అంతేకాదు.. తాము అధికారంలోకి వస్తే.. యూపీ తరహా లవ్ జిహాద్ నిరోధక చట్టాన్ని కూడా తీసుకోస్తామంటూ బీజేపీ తమ మ్యానిఫెస్టోలో పేర్కొంది.
ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం ఓ గెజిట్ విడుదల చేసింది. దీనిని పరిశీలించినప్పుడు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేరళలో 2020లో హిందూ మతంలోకి మారిన వారే ఎక్కువ అని తేలింది. కేరళలో 506 మంది మతం మార్చుకోగా.. అందులో 241 మంది హిందూ మతాన్ని స్వీకరించారు. వీరిలో క్రైస్తవులు, ముస్లింలు ఉన్నారు. ఇక ఇస్లాం మతంలోకి మారిన వారి సంఖ్య 144 కాగా.. క్రైస్తవ మతంలోకి మారిన వారి సంఖ్య 119. కాగా, 2020లో 242 మంది క్రైస్తవ మతాన్ని విడిచిపెట్టగా,40 మంది ఇస్లాం మతా న్ని వీడినట్లు తేలింది. ఇక హిందూ మతం నుంచి 77 శాతం ఇస్లాంలోకి వెళ్లినట్లు రిపోర్టులు చెబుతున్నాయి.