పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా హత్యకు బాధ్యత వహించిన గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్, పంజాబ్ పోలీసులు తనను ఫేక్ ఎన్కౌంటర్ చేస్తారని భయపడి పాటియాలా కోర్టును ఆశ్రయించాడు. తనను ఎన్కౌంటర్లో చంపేస్తారని భయంగా ఉందని.. పంజాబ్ పోలీసులకు అప్పగించవద్దని బిష్ణోయ్ కోర్టుకు కోరాడు.
https://twitter.com/ANI/status/1531258002270920705?s=20&t=sKPPGM2WdBEKksH6SHBz5Q
అయితే గ్యాంగ్స్టర్ దాఖలు చేసిన పిటిషన్ను స్వీకరించడానికి లేదా బిష్ణోయ్ భద్రతకు సంబంధించి ఏవైనా ఆదేశాలు ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. భద్రత అనేది రాష్ట్ర అంశం అని పేర్కొంది.
బిష్ణోయ్ ప్రస్తుతం కఠినమైన MCOCA (మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్) కింద ఆర్గనైజ్డ్ క్రైమ్ కేసులో ఢిల్లీలోని తీహార్ జైలులో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.
ఇతర రాష్ట్రాల జ్యూడిషియల్ అధికారులు తనకు వ్యతిరేకంగా జారీ చేసిన ప్రొడక్షన్ వారెంట్ల కారణంగా తనపై విచారణ రాజీ పడుతుందనే భయం కూడా ఉందని తన న్యాయవాది ద్వారా బిష్ణోయ్ తన పిటిషన్లో పేర్కొన్నాడు.
తనపై పంజాబ్ పోలీసులు లేదా ఇతర పోలీసు బలగాలు జారీ చేసిన ప్రొడక్షన్ వారెంట్ల గురించి ముందస్తు నోటీసులను కోర్టుకు సమర్పించాలని.. తనను మరే ఇతర పోలీసు బలగాలకు అప్పగించవద్దని అభ్యర్థించారు. భౌతికంగా తనను కస్టడీలోకి తీసుకోకుండా తీహార్ జైలులో తనపై పెండింగ్లో ఉన్న కేసులను ఎవరైనా పోలీసులు విచారించవచ్చని కూడా అతడు అభ్యర్థించాడు.
జైలులో ఉన్న గ్యాంగ్స్టర్కు భద్రతను పెంచాలని కోరుతూ లారెన్స్ బిష్ణోయ్ లాయర్ కూడా ఢిల్లీలోని పాటియాలా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. లారెన్స్ బిష్ణోయ్ను హత్య చేసేందుకు ప్రత్యర్థి ముఠా ప్రయత్నించవచ్చని లాయర్ ఆరోపించారు.
ఇదిలా ఉండగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుల తోపాటు జైలులో ఉన్న కాలా జతేడి, కాలా రాణా గురించి ఆరా తీయడానికి పంజాబ్ పోలీసులు ఇప్పటికే ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులను సంప్రదించినట్లు సమాచారం.
సిద్ధూ మూసేవాలా హత్య కేసుకు సంబంధించి పంజాబ్ పోలీసులు బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులను కూడా తమ కస్టడీలోకి తీసుకుని విచారించవచ్చని కూడా వర్గాలు తెలిపాయి. సిద్ధూ మూసేవాలా హత్య వెనుక ముఠా ప్రత్యర్థి ఉన్నట్లు అనుమానిస్తున్నట్లు పంజాబ్ పోలీసులు తెలిపారు. మూసేవాలా హత్యకు బాధ్యత వహించిన కెనడాకు చెందిన గ్యాంగ్స్టర్ గోల్డీ బ్రార్ తీహార్ జైలులో ఒకరితో టచ్లో ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.
లారెన్స్ బిష్ణోయ్ గ్రూప్ సహా ఇతర గ్యాంగ్స్టర్ల నుంచి సిద్ధూ మూసేవాలాకు తరచూ బెదిరింపు కాల్స్ వస్తాయని సిద్ధూ తండ్రి బల్కౌర్ సింగ్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ బెదిరింపులు వచ్చిన తర్వాత మూసేవాలా బుల్లెట్ప్రూఫ్ ఎస్యూవీని కూడా కొనుగోలు చేశాడని సింగ్ చెప్పారు.