రాష్ట్ర రాజధాని నడిబొడ్డున మైనర్ పై గ్యాంగ్ రేప్ కలకలం రేపుతోంది. జూబ్లీహిల్స్లోని ఓ పబ్ సమీపంలో మే 28న 17 ఏళ్ల బాలికపై కారులో ఐదుగురు నిందితులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ శుక్రవారం సాయంత్రం ఈ కేసుకు సంబంధించి కీలక వివరాలు తెలిపారు. నిందితుల్లో రాష్ట్ర వక్ఫ్బోర్డు చైర్మన్ మసీవుల్లాఖాన్ కుమారుడు, మరో ఇద్దరు మైనర్లుకాగా.. పుప్పాలగూడకు చెందిన సాదుద్దీన్ మాలిక్ (18), బంజారాహిల్స్కు చెందిన ఉమేర్ఖాన్ ఉన్నారు. వీరిలో సాదుద్దీన్ను అరెస్టు చేసిన పోలీసులు.. మసీవుల్లాఖాన్ కుమారుడి ఆచూకీ గుర్తించారు. అతడు మైనర్ కావడంతో శనివారం ఉదయం తదుపరి చర్యలు తీసుకోనున్నారు. అప్పటివరకు అతడిపై ప్రత్యేక బృందంతో నిఘా వేసి ఉంచారు. బాధిత బాలిక షాక్లో ఉన్న కారణంగా వివరాలు సరిగా చెప్పలేకపోతోందన్నారు. ఒక నిందితుడి పేరు మాత్రమే చెప్పగలిందని వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విదేశీయుడైన ఓ వ్యక్తి బతుకుతెరువు కోసం చాలా కాలం క్రితం నగరానికి వచ్చాడు. ఇక్కడ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న మహిళతో అతడికి వివాహమైంది. వారికి కుమారుడు, కుమార్తె(16) ఉన్నారు. కుమార్తె ఒపెన్ స్కూల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది. హాదీ అనే ఈవెంట్ ఆర్గనైజర్ వారి ఇంటిపక్కన ఉండేవాడు. అతడు జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లోని అమ్నేషియా అండ్ ఇన్సోమ్నియా పబ్లో గత నెల 28న ఒక పార్టీ ఏర్పాటు చేశాడు. ఆ పార్టీకి బాలికను కూడా తీసుకెళ్లాడు. ఆమె అక్కడ సంగీతం వింటూ డాన్స్ వేస్తుండగా.. ఒక బాలుడు (17) ఆమె వద్దకు వచ్చాడు. ఇద్దరూ కొద్దిసేపు మాట్లాడుకున్నారు. అతడు తన స్నేహితులను పిలిచాడు. అందరూ ఆమెతో మాట కలిపారు. ‘‘దగ్గర్లో ఉన్న బేకరీలో పేస్ట్రీలు బాగుంటాయి తిందాం రావాల’’ంటూ ఆమెను ఆహ్వానించారు. సాయంత్రం 5.45 గంటలకు బాలికతో సహా అందరూ కలిసి కిందకు వచ్చి TS09 FL6460 నంబర్ గల ఎరుపు రంగు మెర్సిడెస్ బెంజ్, ఇన్నోవా కార్లలో బంజారాహిల్స్ రోడ్ నంబరు 14లోని బేకరీకి 6 గంటలకు వెళ్లారు. సుమారు రెండు గంటల తర్వాత తిరిగి పబ్కు చేరుకున్నారు. బాలికను అక్కడ దించేసి వారంతా వెళ్లిపోయారు. బాలిక తన తండ్రికి ఫోన్ చేసి అక్కణ్నుంచీ తీసుకెళ్లాల్సిందిగా కోరింది. తండ్రి వచ్చి ఆమెను తీసుకెళ్లాడు.
అయితే.. ఇంటికి వెళ్లిన బాలిక ఆందోళనతో రెండు రోజుల పాటు ఎవరితోనూ మాట్లాడకుండా ముభావంగా ఉండిపోయింది. దీనితో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు గట్టిగా ప్రశ్నించడంతో.. తనతో ఐదుగురు అసభ్యంగా ప్రవర్తించారని చెప్పింది. ఈ మేరకు బాలిక తండ్రి గత నెల 31న సాయంత్రం జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఐపీసీ సెక్షన్లు 354, 323, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
అనంతరం బాలికను కౌన్సెలింగ్ కేంద్రానికి పంపి సీనియర్ మహిళా పోలీసు అధికారులు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ సమయంలో, మైనర్ తనకు జరిగిన సంఘటన గురించి పోలీసు అధికారికి వివరంగా చెప్పింది. బాధితురాలి వాంగ్మూలం తర్వాత, పోలీసులు ఆమెకు వైద్య పరీక్షలు చేయించారు
ఏఐఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడి ప్రమేయం వల్లే హైదరాబాద్ పోలీసులు నిందితులను ఇంకా పట్టుకోలేదని తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి కేఈ కృష్ణసాగర్ రావు అన్నారు. పోలీసులు ఏఐఎంఐఎం, టీఆర్ఎస్ల నుంచి రాజకీయ ఒత్తిళ్లకు గురవుతున్నారన్నారు.
బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్ రావు మాట్లాడుతూ.. “ఐదుగురు నేరగాళ్లను అరెస్ట్ చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. కారు సీజ్ చేసినా హైదరాబాద్ పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నిస్తున్నా. ఈ కేసులో బాలిక తల్లిదండ్రులు జూన్ 1న ఫిర్యాదు చేశారు. అదనంగా అన్ని సందర్భోచిత ఆధారాలు కూడా అందుబాటులో ఉన్నాయి. సీఎం కేసీఆర్ లేదా ఏఐఎంఐఎం అధినేత ఒవైసీ అనుమతి కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారా?” అని ప్రశ్నించారు.
ఈ ఘటనకు సంబంధించి పలు సంచలన విషయాలు వెలుగులోకి రాగా.. తాజాగా ఫొటోలు, వీడియోలను బీజేపీ రిలీజ్ చేసింది. శనివారం నాడు హైదరాబాద్లో మీడియా మీట్ నిర్వహించిన బీజేపీ ఎమ్మెల్యే రఘనందనరావు ఈ ఫొటోలను రిలీజ్ చేశారు.
అయితే.. ఈ ప్రెస్మీట్ తర్వాత ఒక్కసారిగా ఇంటెలిజెన్స్ ఉలిక్కిపడింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఎస్బీ , లా అండ్ ఆర్డర్, ఇంటెలిజెన్స్, వెస్ట్ జోన్ పోలీసులతో పాటు పలువురు హుటాహుటిన సమావేశమయ్యారు. అసలు నిందితుల వీడియోలు, ఫోటోలు ఎలా లీక్ అయ్యాయన్న దానిపై ముఖ్యంగా పోలీసులు ఆరా తీస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుకి ఈ వీడియోలు ఎలా చేరాయనే దానిపై కూడా అధికారులు లోతుగా చర్చిస్తున్నారు. ఇవాళ సాయంత్రం ఉన్నతాధికారులు మీడియా మీట్ నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి.