మన తెలంగాణ లో కొంతకాలంగా గణపతి నిమజ్జనం వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున గణనాథులను తీసుకుని వెళ్లి నిమజ్జనం చేసి యువత ఉత్సాహంగా భజనలు నినాదాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా గణపతి బప్పా మోరియా అంటూ నినదించడం ఆనవాయితీ.
గణపతి బప్పా అంటే అందరికీ భగవంతుడు అని తెలుసు. కానీ మోరియా అనే పదానికి అర్ధం చాలామందికి తెలియదు . నిజానికి మోరియా గోసామీ అనే ఆయన ఒక గొప్ప సాధువు. మహారాష్ట్ర లోని పుణెకు 21 కి.మీ. దూరంలో చించ్ వాడి అనే గ్రామంలో నివసించేవాడు. ఆయన గణపతికి పరమ భక్తుడు. గణపతిని పూజించేందుకు చించ్ వాడి నుంచి మోరే గావ్ వరకు రోజూ కాలినడకన వెళ్లేవాడు.
ఓ రోజు మోరియా నిద్రపోతున్న సమయంలో గణేశుడు కలలో కనిపించి.. సమీపంలో ఉన్న నదిలో తన విగ్రహం ఉందనీ.. దాన్ని తీసుకువచ్చి ప్రతిష్టించమని చెప్పాడట.. కలలో గణపతి చెప్పిన మాట నిజమో కాదో వెంటనే తెలుసుకోవడానికి మోరియా అక్కడున్న నదికి వెళ్లాడు. కలలో గణపతి చెప్పినట్టుగానే నదిలో మోరియాకు వినాయకుడి విగ్రహం దొరికింది.
ఈ విషయం తెలుసుకున్న స్థానికులు మోరియా గోసావి ఎంత గొప్పవాడు కాకపోతే సాక్షాత్తు వినాయకుడు కలలో కనిపిస్తాడు అంటూ.. మోరియాను చూసేందుకు తండోపతండాలుగా వచ్చారట. మోరియా గోసావి పాదాలను తాకి మోరియా అనటం మొదలుపెట్టారు.
నది నుండి తెచ్చిన గణపతి ప్రతిమను తెచ్చి గుడిని నిర్మించాడు. మోరియా గొప్ప భక్తుడు అయ్యాడు కాబట్టి నాటి నుంచి గణపతి ఉత్సవాల్లో మోరియా గోసావి పేరు గణపతి ఉత్సవాల్లో బాగమైపోయింది.. ఆనాటి నుంచి గణపతి బప్పా మోరియా…అనే నినాదం నిర్విరామంగా వినబడుతూనే ఉంది. గణపతి వైభవాన్ని ప్రజలకు తెలియచెప్పేందుకు గ్రామాలలో గణపతి ఉత్సవాలు చేయించడం ఆయన మొదలుపెట్టారు. మోరియా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గణపతి పందిళ్లు ఉత్సవాలు మహారాష్ట్రలో ఊపందుకున్నాయి . దీంతో ఆయన పేరు మారుమోగిపోయింది.
స్వయంగా వినాయకుని దర్శించిన భక్తుడు కాబట్టి మోరియాకి ఆ గౌరవం కల్పిస్తారు.. అందుకే గణపతి ఉత్సవాలలో గణపతి బప్పా మోరియా అంటూ జేజేలు పలుకుతారు.