గ్రేటర్ మేయర్ గా గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ గా మోతే శ్రీలతరెడ్డి
గ్రేటర్ హైదరాబాద్ మేయర్గా గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్గా తార్నాక కార్పొరేటర్ మోతే శ్రీలత రెడ్డి ఎన్నికయ్యారు.ఎంఐఎం మద్దతుతో టీఆర్ఎస్ మరోసారి బల్దియాను గెలుచుకుంది. ఎక్స్అఫిషియో ఓట్లతో సంబంధం లేకుండానే యేయర్ ఎన్నిక పూర్తయ్యింది. అయితే ఎన్నిక విధానంపై బీజేపీ కార్పొరేటర్లు నిరసన వ్యక్తం చేశారు. జైశ్రీరామ్ నినాదాలతో హోరెత్తించారు. టీఆర్ఎస్ అధిష్టానం ఆదేశం మేరకు షీల్డు కవర్ తెరిచి మేయర్గా విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్గా శ్రీలత రెడ్డి పేర్లను అధికారికంగా ప్రకటించారు.
గద్వాల విజయలక్ష్మి బంజారాహిల్స్ నుంచి రెండోసారి కార్పొరేటర్గా గెలిచారు. టీఆర్ఎస్ సీనియర్ నేత కేకే తనయ విజయలక్ష్మి. ఎల్ఎల్బీ, జర్నలిజం చదివిన ఆమె… అమెరికాలో 18 ఏళ్లున్నారు. 2007లో అమెరికా పౌరసత్వం వదులుకుని స్వదేశానికి తిరిగివచ్చారు.
ఎన్నిక అనంతరం విజయలక్ష్మి మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. ఇకపూ హైదరాబాదీ మహిళలకు ఎటువంటి ఇబ్బందులుండవని భరోసా ఇచ్చారు.
మేయర్ పీఠంపై ఆశలు పెట్టుకున్న ఖైరతాబాద్ కార్పొరేటర్, పీజేఆర్ కూతురు విజయారెడ్డికి మరోసారి నిరాశే ఎదురైంది. అసలైతే గతంలోనే విజయారెడ్డికి మేయర్ పీఠం దక్కుతుందని అందరూ అనుకున్నారు. ఈసారి మొండిచేయి చూపడంతో ఆమె చాలా అసంతృప్తిగా ఉన్నారు. మేయర్ ఎన్నికలో పాల్గొనకుండానే కారెక్కి వెళ్లిపోయారు. అయితే టీఆర్ఎస్ నేతలు కొందరు ఫోన్ చేసి నచ్చజెప్పడంతో ఆమె వచ్చారని తెలిసింది.