నిధి సమర్పణ అభియాన్.. అంచనాకు మించి వచ్చిన విరాళాలు..!
అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం చేపట్టిన నిధి సమర్పణ అభియాన్ శనివారంతో ముగిసింది. మకర సంక్రాంతి రోజున ప్రారంభమైన ఈ కార్యక్రమం 44 రోజులు కొనసాగింది. దేశ వ్యాప్తంగా జరిగిన ఈ నిధి సమర్పణ అభియాన్ ద్వారా.. రామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్టు ఊహించని దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు.. నిధి విషయంలో కూడా అంచనాలకు మించి సేకరణ జరిగింది. ఈ విషయాన్ని రామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్టు సభ్యులు వెల్లడించారు. ఇప్పటి వరకు నిధి సమర్పణ అభియాన్ ద్వారా.. రూ.2100/- కోట్లకు పైగా వచ్చాయని ట్రస్టు అధికారులు వెల్లడించారు. అయితే ఇంకా కూడా డబ్బును బ్యాంకుల్లో డిపాజిట్ చేయాల్సి ఉందన్నారు. ఈ డిపాజిట్ ప్రక్రియ పూర్తయిన తర్వాత విరాళాల మొత్తం మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. వచ్చిన నిధి మొత్తం ట్రస్టుకు సంబంధించిన మూడు ప్రధాన బ్యాంకు ఖాతాల్లోనే జమా చేస్తున్నట్లు వెల్లడించారు.
కాగా, వచ్చిన మొత్తం డబ్బును లెక్కించిన తర్వాత.. ఆడిట్ ప్రక్రియ పూర్తి చెయ్యడానికి మరో నెల రోజుల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇక ఈ నిధి సమర్పణ అభియాన్ కార్యక్రమంలో దాదాపు 1.5 లక్షల మంది వీహెచ్పీ, సంఘ్ పరివార్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక దాదాపు అన్ని ప్రాంతాల్లో ఈ కార్యక్రమం ప్రశాంతంగా జరగగా.. ఢిల్లీలో మాత్రం ఓ బజరంగ్ దళ్ కార్యకర్త ముష్కరుల చేతిలో ప్రాణాలు కోల్పోయాడు.