భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో సుప్రీం కోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్ ఎన్వీరమణ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం రాష్ట్రపతి హోదాలో ముర్ము తొలిప్రసంగం చేశారు. అనంతరం ఆమె రాంనాథ్ కోవింద్ తో కలిసి రాష్ట్రపతి భవన్ కు వెళ్లారు. 2017లో పదవీబాధ్యతలు చేపట్టిన కోవింద్ పదవీకాలం నిన్నటితో ముగిసింది. ఆయనకు నిన్న ఘనమైన వీడ్కోలు పలికారు. ముర్ము ప్రమాణస్వీకారం తరువాత ఆయనకూడా పార్లమెంట్ హౌస్ నుంచి ముర్ముతో కలిసి రాష్ట్రపతి భవన్ కు వెళ్లారు. రాష్ట్రపతి భవన్ చేరుకున్న ద్రౌపది రక్షకదళం గౌరవ వందనం స్వీకరించారు. 21 గన్ సెల్యూట్ చేశారు.
వార్డు కౌన్సిలర్ నుంచి రాష్ట్రపతి అయ్యానని ఆదివాసీ గ్రామం నుంచి మొదలైన నా ప్రయాణం రాష్ట్రపతిభవన్ వరకు వచ్చిందని ఉద్వేగంతో చెప్పారు ద్రౌపది ముర్మి. తమ గ్రామంలో పదోతరగతి చదువుకున్న బాలికను తానేనన్నారు.తానిక్కడ వరకు చేరడం వ్యక్తిగత విజయం మాత్రమే కాదని…ఆదివాసీలు, దళితుల విజయమని ఆమె అన్నారు. దేశ అత్యున్నత పదవిని చేపట్టడం ఆనందంగా ఉందన్న ముర్ము… ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలనీ అన్నారు.
దేశప్రజలకు కార్గిల్ విజయ్ దివస్ శుభాకాంక్షలు తెలిపిన ముర్ము..ఆజాదీకా అమృత్ మహోత్సవాలు జరుపుకుంటున్న శుభతరుణమిదనీ అన్నారు. వచ్చే 25 ఏళ్లల్లో భారత్ అద్భుతమైన పురోగతి సాధిస్తుందని ఆమె ఆకాంక్షించారు.
ఇక ప్రమాణ స్వీకారం సందర్భంగా ద్రౌపది ధరించిన చీర అందరి దృష్టినీ ఆకర్షించింది. ఎరుపు, ఆకుపచ్చ అంచులతో ఉన్న తెల్లని చీరను ఆమె ధరించారు. అది సంతాలీ తెగ సంప్రదాయ చీర. చేనేత కార్మికులు ఎలాంటి యంత్రాలు వాడకుండా నేచిన చీర అది. ఒకప్పుడు గిరిజనులు ఆ చీరల్ని ప్రత్యేక సందర్భాల్లో ధరించేవారు. మహిళల సాధికారతకు చిహ్నంగా భావిస్తారు. తూర్పు భారతదేశంలోని జార్ఖండ్, ఒడిషా, పశ్చిమబెంగాల్, అసోం తదిరల రాష్ట్రాల్లో ఇలాంటి చీరలు ఎక్కువగా ధరిస్తారు. అయితే రాన్రానూ కాస్త ఆధునికత మేళవించుకుంది.