తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రానున్న తరుణంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందించనుంది. ఈ క్రమంలో ఉచిత శిక్షణ కోసం మంత్రి గంగుల కమలాకర్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభించారు. వార్షిక ఆదాయం రూ.5 లక్షల్లోపు ఉన్నవారు ఇవాళ్టి నుంచి ఈ నెల 16 వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 16న ఆన్లైన్లో ఎంపిక పరీక్ష నిర్వహించి 21 నుంచి దాదాపు 50 కోట్ల రూపాయల ఖర్చుతో బీసీ స్టడీ సర్కిళ్లు, సెంటర్ల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో 1,25,000 మందికిపైగా విద్యార్థులకు ఉచిత కోచింగ్ నిర్వహిస్తామని చెప్పారు.
టీఎస్పీఎస్సీ నిర్వహించే గ్రూప్ 1,2,3,4 తోపాటు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నియామకం చేసే పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాలు, వ్యవసాయ శాఖ, వైద్యశాఖ సహా ఇతర శాఖల నియామక పరీక్షలకు కోచింగ్ సదుపాయాన్ని అందజేస్తామని తెలిపారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)