ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం కింద దేశంలోని పేదలకు ఇస్తున్న ఉచిత రేషన్ స్కీంను మరో నాలుగు నెలలు పొడిగించింది కేంద్రం. ఈమేరకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. గతేడాది కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న పరిస్థితుల్లో పేదల్ని ఆదుకునేందుకు పీఎంజీకేఏవై స్కీమ్ కింద ఉచిత రేషన్ అందజేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఇటీవల పరిస్థితులు తిరిగి మెరుగుపడటంతో నవంబర్ 30వ తేదీ నుంచి ఉచిత రేషన్ పంపిణీని నిలిపివేయనున్నట్టు గత నవంబర్ 5న ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో పథకాన్ని పొడిగించాలని ‘రైట్ టు ఫుడ్’ కార్యకర్తలు సహా పలు పార్టీలు కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి. వీటిని పరిగణనలోకి తీసుకున్న కేంద్రం వచ్చే ఏడాది మార్చివరకూ పథకాన్ని పొడిగించాలని నిర్ణయించింది.