కర్నాటకలో ఉచిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అదే వ్యూహాన్ని మధ్యప్రదేశ్ లో అమలుచేయాలనుకుంటోంది. రాష్ట్రంలో ఈ ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే తాము అధికారంలోకి రాగానే ఉచిత విద్యుత్ పథకం తీసుకువస్తామని కాంగ్రెస్ నేత, మాజీ సీఎం కమల్ నాథ్ హామీ ఇచ్చారు. 100 యూనిట్ల వరకూ విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదని ఆయన ట్వీట్ చేశారు.మహిళలకు నెలకు 15వందల రూపాయల సాయం ఇస్తామన్నారు. ఇక ఎల్పీజీపై రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీని కూడా పెంచుతామని, రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర సర్కారుపై ఆయన మండిపడ్డారు. కర్ణాటకలో ఓటమి , మధ్యప్రదేశ్లో ఎన్నికలు ముంచుకొస్తుండటంతో బీజేపీ ఒకదాని వెంట మరొకటి నిలకడలేని ప్రకటనలు చేస్తోందన్నారు. ఢిల్లీ, పంజాబ్ ఎన్నికల్లో ఉచిత విద్యుత్ హామీలతో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ ఫార్ములాతోనే కాంగ్రెస్ కర్నాటకలో ఎన్నికలకు వెళ్లి గెలిచింది.