పంజాబ్ కాంగ్రెస్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నలుగురు మాజీ మంత్రులు డాక్టర్ రాజ్ కుమార్ వెర్కా, బల్బీర్ సింగ్ సిద్ధూ, గురుప్రీత్ సింగ్ కంగర్ సహా సుందర్ శామ్ అరోరా ఈరోజు చండీగఢ్లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. బర్నాలా మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే కేవల్ సింగ్ ధిల్లాన్, శిరోమణి అకాలీదళ్ మాజీ ఎమ్మెల్యేలు సరూప్ చంద్ సింగ్లా, మొహిందర్ కౌర్ జోష్ కూడా బీజేపీలో చేరారు.
కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, సోమ్ ప్రకాష్, రాష్ట్ర విభాగం చీఫ్ అశ్వనీ శర్మ, పార్టీ సీనియర్ నేతలు దుష్యంత్ గౌతమ్, తరుణ్ చుగ్, సునీల్ జాఖర్, మంజీందర్ సింగ్ సిర్సా సమక్షంలో షా పార్టీలోకి స్వాగతం పలికారు.
మొహాలీ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన బల్బీర్ సిద్ధూ గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆరోగ్యశాఖ మంత్రిగా ఉండగా.. రాంపుర ఫుల్ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గుర్ప్రీత్ కంగార్ రెవెన్యూ మంత్రిగా సేవలందించారు. మజా ప్రాంతానికి చెందిన ప్రముఖ దళిత నాయకుడు రాజ్ కుమార్ వెర్కా మూడుసార్లు శాసనసభ్యుడిగా కూడా ఉన్నారు. గత ప్రభుత్వంలో సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్ మెంట్ అండ్ మైనారిటీస్ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. హోషియార్పూర్ మాజీ ఎమ్మెల్యే సుందర్ శామ్ అరోరా గత కాంగ్రెస్ ప్రభుత్వంలో పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రిగా పనిచేశారు.
మొహాలీ కార్పొరేషన్ మేయర్గా ఉన్న బల్బీర్ సిద్ధూ సోదరుడు అమర్జిత్ సింగ్ సిద్ధూ కూడా బీజేపీలో చేరారు.
హర్యానాలోని పంచకుల పట్టణంలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ను ప్రారంభించే ముందు పార్టీ నేతలతో సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు మధ్యాహ్నం చండీగఢ్ చేరుకున్నారు.