చిరుతతో పోరాడి తన బిడ్డను దక్కించుకుంది ఓ మహిళ. బిడ్డకోసం తన ప్రాణాలను ఒడ్డేందుకు సిద్ధమైంది. తన కొడుకును నోటకరుచుకుని వెళ్తున్న చిరుతను వెంబడిస్తూ దాదాపు కిలోమీటర్ దూరం అడవిలోకి పరుగెత్తింది. చివరకు బిడ్డను లాగేసుకుని బయటపడింది. ఈ క్రమంలో తనకెన్నో గాయాలైనా భరించింది.మధ్యప్రదేశ్ సిద్ధి జిల్లాలోని ప్రాంతంలోని సంజయ్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని బరిజహారియా గ్రామంలో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం తల్లీ కొడుకులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
బైగా తెగకు చెందిన కిరణ్ అనే మహిళ ఆదివారం సాయంత్రం తన ఇంటిముందు వంట చేస్తోంది. ఆ సమయంలో ఆమె ఎనిమిదేళ్ల కుమారుడు రాహుల్ ఇంటిముందు ఆడుకుంటున్నాడు. హఠాత్తుగా వచ్చిన ఓ చిరుత రాహుల్ ను నోటకరుచుని పరుగెత్తింది. అది చూసిన కిరణ్ పెద్ద కర్రతో చిరుతను వెంబడించింది. అలా కిలోమీటర్ వరకు దానివెంట పరుగెత్తింది. కర్రతో బాదుతూనే ఉంది. వెనక్కి తిరిగిన చిరుత కిరణ్ మీదకు వచ్చింది. ఆమె వెంటే పరుగెత్తి వచ్చిన గ్రామస్తులు కర్రలు, రాళ్లతో దాన్ని కొట్టారు. దీంతో పిల్లాడిని వదిలేసి వెళ్లిపోయింది చిరుత. గాయాలపాలైన ఇద్దర్నీ స్థానికులు, అటవీ అధికారులు ఆస్పత్రిలో చేర్చారు.
ప్రాణాలకు తెగించి చిరుతతో కొట్లాడి బిడ్డను దక్కించుకున్న కిరణ్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆమె చూపిన తెగువ అసమాన్యం అంటూ శివరాజ్ సింగ్ చౌహాన్ ట్వీట్ చేశారు. వారి చికిత్సకయ్యే ఖర్చులను ప్రభుత్వమే భరిస్తోందని అటవీ అధికారులు తెలిపారు.