జనాభా పెరుగుదలను నియంత్రించే మార్గదర్శకాలను రూపొందించాలంటూ కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది సుప్రీం కోర్ట్. జనసంఖ్య పెరుగుతున్నా సరిపడా వనరులు లేవంటూ దాఖలైన పిటిషన్ పై సుప్రీం కోర్టు విచారణ జరిపింది. జస్టిస్ కేఎం జోసెఫ్, హృశికేశ్ రాయ్ తో కూడిన ధర్మాసనం కేంద్రాన్ని నివేదిక కోరింది. అఖిలభారతీయ సంత్ సమితి ప్రధాన కార్యదర్శి జితేంద్రనాథ్ సరస్వతి స్వామి ఈ పిల్ వేశారు. ఏటేటా పెరుగుతున్న జనాభాకు తగ్గట్టు సహజ వనరులు లేవని… పేదరికం నిరుద్యోగం పెరిగి ప్రజల జీవనప్రమాణాలు పడిపోతున్నాయని పిల్ లో పేర్కొన్నారు. జనాభాను కట్టడి చేసేలా చర్యలకు ఆదేశించాలని కోర్టుకు విన్నవించారు. అమెరికాలో ఏటా 10 వేల మంది పుడుతుంటే భారత్ లో 70 వేల పుడుతున్నారని పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన గౌరవంతో జీవించే హక్కు. స్వచ్ఛమైన గాలి, నీరు. పరిశుభ్రమైన నీరు, వాతావరణం, విద్య, వైద్యం వంటివి అందరికీ అందాలంటే జనాభాను నియంత్రించాలని స్వామి పిటిషన్లో విజ్ఞప్తి చేశారు.ఇందుకోసం కేంద్రం సరైన నిబంధనలు తీసుకొచ్చేలా సుప్రీం కోర్టు మార్గనిర్దేశం చేయాలని ఆయన కోరారు.