తెలుగు రాష్ట్రాలలో శ్రీ సరస్వతీ శిశుమందిర్ పాఠశాలలు అందరికీ తెలిసినవే. ఇటువంటి పాఠశాలలు దేశంలోని వివిధ రాష్ట్రాలలో వేర్వేరు పేర్లతో నడుస్తూ ఉంటాయి. మహారాష్ట్రలో సరస్వతీ విద్యాలయ హైస్కూల్స్ కూడా సాంప్రదాయాలు, విలువలకు పెట్టింది పేరు. ఆ విద్యాలయంలో విలువలు వంట బట్టించుకొన్న పూర్వ విద్యార్థే నేటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్.
నాగపూర్ లో శ్రీ సరస్వతీ విద్యాలయ స్థాపన వెనుక చిత్రమైన కారణం ఉంది. నాగపూర్ లో తెలుగు, తమిళ ప్రజల సంఖ్య బాగానే కనిపిస్తుంది. కానీ అక్కడ ఈ కుటుంబాల పిల్లల కోసం ప్రత్యేకంగా పాఠశాల లేనే లేదు. దీంతో సౌత్ ఇండియా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ పాఠశాల ఏర్పాటు చేశారు. ఆ పాఠశాలలో తెలుగు విద్యార్థులు ఎక్కువగా ఉండేవారు. తెలుగును ఒక సబ్జెక్టుగా కూడా బోధించేవారు. చాలా కాలం పాటు సౌత్ ఇండియ అసోసియేషన్ ఆధ్వర్యంలోనే స్కూలును నిర్వహించారు. అందుచేతనే తెలుగు అర్థం చేసుకోవటం, కొద్ది కొద్ది గా మాట్లాడటం కూడా ఫడ్నవీస్ కు వచ్చు.
ఈ పాఠశాలలో మామూలు సబ్జెక్టులతో పాటు దేశం, ధర్మం పట్ల అవగాహన కల్పించటం విశేషం. అందుకే అక్కడ విద్యార్థుల్లో అటువంటి విలువలు కనిపిస్తూ ఉంటాయి. మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఆ బాటలోనే నడుస్తూ విలువలకు కట్టుబడి రాజకీయాలు చేస్తూ వచ్చారు. పార్టీ సూచన మేరకు ఉప ముఖ్యమంత్రిగా పరిమితం అయి, నిబద్దతతో పనిచేస్తూ వచ్చారు. పార్టీ అవకాశం ఇచ్చాక మాత్రమే ముఖ్యమంత్రి స్థానంలోకి మారి, పదవీ బాధ్యతలు చేపడుతున్నారు.