మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత. నారాయణ విద్యాసంస్థల అధినేతను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కొండాపూర్లోని అతని నివాసానికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. ఏపీలో ఇటీవల పదోతరగతి పేపర్ లీకైన సంగతి తెలిసింది. ఈ వ్యవహారంలో నారాయణ బ్రాంచ్ నుంచే తెలుగు పేపర్ లీకైనట్టు గుర్తించారు. దీంతో అదుపులోకి తీసుకున్న పోలీసులు చిత్తూరుకు తరలించారు. టెన్త్ పేపర్ లీకేజీలో నారాయణ విద్యాసంస్థల ప్రమేయం ఉందని ముందునుంచి ఆరోపణలు వస్తున్నాయి. తిరుపతి నారాయణ ఎస్వీ బ్రాంచ్ నుంచే తెలుగుపేపర్ వెలుగులోకి వచ్చిందని నిర్థారణకు వచ్చారు. ఉదయం పరీక్ష ప్రారంభం అయిన వెంటనే గిరిధర్ అనే ఉద్యోగి వాట్సప్ నెంబర్ నుంచి పేపర్ బయటకువచ్చిందని గుర్తించారు. పేపర్ లీకేజ్ వ్యవహారం బయటకు వచ్చిన వెంటనే జగన్ సీరియస్ అయ్యారు. పేపర్లు లీక్ చేసింది నారాయణ, చైతన్య విద్యాసంస్థలేనని ఆరోపించారు. నారాయణ సంస్థల అధినేత చంద్రబాబు సన్నిహితుడని అందరికీ తెలుసనీ జగన్ ఆ రోజే వ్యాఖ్యానించారు. ఈ విషయంలో కఠినంగా ఉండాలని జగన్ అనడంతో సీఐడీ దూకుడు పెంచింది. వైస్ ప్రిన్సిపల్ గిరిధర్ సహా మరో ఇద్దర్ని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకోగా…నారాయణను అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు చేశారు. అయితే నాలుగురోజులుగా ఆయన ఫోన్ స్విచాఫ్ చేసి ఉందని చెబుతున్నారు. ఇవాళ ఏపీ పోలీసులు హైదరాబాద్ లో ఉన్న ఆయన్నిఅరెస్ట్ చేశారు. చిత్తూరు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. అటు రాజకీయ కక్షసాధింపులో భాగంగానే నారాయణను జగన్ ప్రభుత్వం అరెస్ట్ చేయించిందని టీడీపీ ఆరోపిస్తోంది.