మనీలాండరింగ్ కేసులో మహారాష్ట్ర మాజీ హోంమంత్రి, ఎన్సీపీ నేత అనిల్ దేశ్ముఖ్ను ఈడీ అరెస్ట్ చేసింది.అనిల్ దేశ్ముఖ్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 12 గంటలకు పైగా విచారించింది. విచారణ తర్వాత అతన్ని అరెస్టు చేసి మంగళవారం కోర్టు ముందు హాజరుపర్చింది. విచారణకు హాజరు కావాలని కోరుతూ పలుమార్లు సమన్లు జారీచేస్తే దాటవేశారని ఈడీ అంటోంది.ఎట్టకేలకు హాజరైనా విచారణకు సహకరించని కారణంగా అరెస్ట్ చేసినట్టు అధికారులు తెలిపారు.
అంతకుముందు ఈడీ సమన్లపై ఆయన ముంబై హైకోర్టుకు వెళ్లారు. అక్టోబర్ 29న హైకోర్టు ఆయన పిటిషన్ ను తిరస్కరించింది. దర్యాప్తు ఏజెన్సీ ముందు హాజరుకావాలని ఆదేశించింది. సోమవారం ఉదయం 12 గంటలకు ఈడీ కార్యాలయంకు చేరుకున్న అనిల్ అర్థరాత్రి వరకు విచారించారు. ఆయన స్టేట్ మెంట్ ను రికార్డ్ చేశారు.
100 కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలకు పాల్పడ్డారంటూ అనిల్ దేశ్ ముఖ్ పై ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఈడీ విచారణ జరుపుతోంది.ముంబైలోని హోటళ్లు, బార్ల నుంచి ప్రతి నెలా 100 కోట్లు వసూలు చేయాల్సిందిగా ఉద్వాసనకు గురైన అధికారి సచిన్ వాజెను ఆదేశించినట్టు ముంబై మాజీ సీపీ పరమ్ బీర్ సింగ్ ఆరోపించడంతో వివాదం మొదలైంది. ముఖేష్ అంబానీ ఇంటి బయట పేలుడు పదార్థాలతో కూడిన వాహనం నిలిపివేత ఘటనతో ఇది బయటపడింది.పరంబీర్ సింగ్ ఆరోపణల నేపథ్యంలో కేసు దర్యాప్తునకు సీబీఐని ఆదేశించింది కోర్టు. అప్పుడే ఆరోపణ చేసిన పరంబీర్ సింగ్ను ముంబై పోలీసు కమిషనర్ పదవి నుంచి తొలగించింది మహా సర్కారు. అప్పుడే అనిల్ దేశ్ ముఖ్ కూడా రాజీనామా చేశారు.