యూకే మాజీ పార్లమెంటేరియన్ నజీర్ అహ్మద్ కు ఆరేళ్ల జైలుశిక్ష విధించింది లండన్ కోర్టు. బాలికలపై లైంగిక వేధింపుల ఆరోపణలు నిజమని తేలడంతో కోర్టు ఈ శిక్ష విధించింది. యూరప్ గడ్డపై పాకిస్తాన్ కు అనుకూలంగా, భారత్ కు వ్యతిరేకంగా ప్రచారం చేసే సోషల్ యాక్టివిస్ట్ లార్డ్ నజీర్ అహ్మద్. 1970లో ఓ యువతిపై అత్యాచారయత్నం, 11 ఏళ్ల బాలుడిని లైంగికంగా వేధించినట్టు రుజువైంది. దీంతో పాకిస్తాన్ సంతతికి చెందిన నజీర్ ను కోర్టు దేషిగా నిర్థారించింది శిక్ష ఖరారు చేసింది. విచారణ సందర్భంగా న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలే చేసింది. బాధితుల పట్ల నజీర్ చర్య అత్యంత హేయమైందని వాళ్ల జీవితాలపై ఎంతో ప్రభావం చూపిందని వ్యాఖ్యానించింది. ఇంత కాలానికైనా న్యాయం జరిగినందుకు సంతోషంగా ఉందంటూ తీర్పుపై సంతృప్తి వ్యక్తం చేశారు నజీర్ బాధితులు. అయితే ఆ మాజీ పార్లమెంటేరియన్ కున్న లార్డ్ బిరుదును తొలగించాలని కోర్టు ద్వారా యూకే పార్లమెంట్ ను కోరారు. ఎన్నో ఏళ్లుగా మానసిక క్షోభను అనుభవించామని…తలుచుకుంటేనే సిగ్గుగా ఉందని…బాల్యంలో ఎదురైన ఆ చేదు అనుభవాన్ని మర్చిపోలేకపోతున్నామని…ఎంతో ఏడుస్తూ మౌనంగా బాధను దిగమింగుకున్నామనీ కన్నీటిపర్యంతమయ్యారు.
అహ్మద్ సోదరులు ఫరూక్ (71), తారిక్ (66) కూడా వారిని లైంగికంగా వేధించినట్టు విచారణ సందర్భంగా తెలిసింది. అయితే బాధితుల కోరిక మేరకు అతనికున్న లార్డ్ టైటిల్ తొలగింపు అంత సులభమేం కాదు. అందుకు యూకే ప్రభుత్వం చట్టసవరణ చేయాల్సి ఉంటుంది.
ఇక యూకేలో భారత వ్యతిరేక ప్రచారానికి నాయకత్వం వహిస్తుంటాడు నజీర్. పాక్ ఆక్రమిత కశ్మీర్లో పుట్టిన నజీర్ తరువాత యూకే వెళ్లి స్థిరపడ్డారు. అనేక సందర్భాల్లో భారత దేశానికి వ్యతిరేకంగా విషం చిమ్ముతుంటాడు. కశ్మీర్ వేర్పాటువాదులకు సహాయ సహకారాలందించే నజీర్, ఖలిస్తాన్ వేర్పాటు వాదులనూ ప్రోత్సహిస్తుంటాడు.
2018లో భారత హైకమిషన్ కార్యాలయంలో జరిగిన 69వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహిస్తే నిరసిస్తూ దాన్ని బ్లాక్ డే అంటూ నిరసనకు దిగాడు. ఆ నిరసన కార్యక్రమాన్ని ముందుండి నిర్వహించి..పాకిస్తాన్ నిరసనకారుల చేతుల్లో ఉన్న భారత జాతీయ జెండాల్ని చించి కింద పడేసి కాళ్లతో తొక్కాడు. అహ్మద్ ‘ఫ్రీ కాశ్మీర్,’ ‘ఫ్రీ ఖలిస్తాన్,’ ‘ఫ్రీ అస్సాం,’ ‘ఫ్రీ నాగాలాండ్,’ , ‘ఫ్రీ మణిపూర్’ వంటి నినాదాలతో ఐదు ప్రైవేట్ బిల్బోర్డ్ వ్యాన్లను కూడా అద్దెకు తీసుకున్నాడు.
ఆగస్ట్ 2018లో, లండన్లోని ట్రఫాల్గర్ స్క్వేర్లో జరిగిన వివాదాస్పద ‘ఖలిస్తానీ రెఫరెండం 2020’ కార్యక్రమంలో ప్రసంగించిన ముఖ్యవక్తల్లో అతనొకడు. ఆ సమయంలో అనేక మంది భారతీయులు ఆయనను వ్యతిరేకిస్తూ కార్యక్రమాన్ని అడ్డుకోబోయారు. ఇక 2018లో ప్రధాని యూకే పర్యటన సందర్భంగా… కశ్మీరీ, సిక్కు వేర్పాటు వాదులను రెచ్చగొట్టి భారత వ్యతిరేక ప్రచారం చేయించాడు. నిరసన కార్యక్రమాలను ముందుండి నడిపించాడు. కామన్వెల్త్ దేశాల అధినేతల సమావేశానికి 2018 ఏప్రిల్లో మోదీ హాజరయ్యారు. ఆ సందర్భంగా అక్కడి సిక్కులు, కశ్మీర్ వేర్పాటు వాదుల ఆందోళనలు, వ్యతిరేక ప్రచార కార్యక్రమాల్ని ప్లాన్ చేయడంతో పాటు వాటికి నిధులు సమకూర్చిందీ నజీరే. అలాంటి నజీర్ ఇప్పుడు లైంగిక వేధింపుల కేసులో జైలుపాలయ్యాడు.