జపాన్ మాజీ ప్రధాని షింజో అబే దారుణహత్యకు గురయ్యారు. నారాలో ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయనపై ఓ వ్యక్తి సమీపంనుంచి కాల్పులు జరిపాడు. దీంతో ఆయన అక్కడిక్కడే కుప్పకూలారు.
ఆయన చాతి, మెడలోకి బుల్లెట్లు దిగాయి. తీవ్ర రక్తస్రావం అవుతుండగానే ప్రత్యేక విమానంలో ఆయన్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆయన్ని బతికించేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చికిత్స అందిస్తుండగానే ఆయన చనిపోయినట్టు అధికారులు ధ్రువీకరించారు.కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతిఎక్కువకాలం ప్రధానిపదవిలో ఉన్న వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించారు. 2006 నుంచి 2007 వరకు, తరువాత 2012 నుంచి 2020 వరకు ఆయన ప్రధానిగా ఉన్నారు. అనారోగ్య కారణాలతో 2020లో ఆయన తనపదవికి రాజీనామా చేశారు. అయినా రాజకీయాల్లో ఆక్టివ్ గానే ఉంటూ వచ్చారు. తరచూ జపాన్ మీడియోలో దర్శనమిస్తూ అనేక అంశాలపై జరిగే చర్చల్లో పాల్గొనేవారు.
జపాన్ పార్లమెంట్ ఎగువసభకు ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో లిబరల్ డెమొక్రటిక్ పార్టీ తరపున ఆయన చురుగ్గా ప్రచారం చేస్తున్నారు.అందులో భాగంగా భారత కాలమానం ప్రకారం ఉదయం నారా సిటీలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయనపై దుండగుడొకడు కాల్పులు జరిపాడు.
ఆధునిక యుగంలో అత్యంత సురక్షిత దేశంగా జపాన్ ను చెప్తారు. అలాంటిది పట్టపగలు సాక్షాత్తూ మాజీ ప్రధాని హత్య జరగడంతో ప్రపంచదేశాలన్నీ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. తనకెంతో ఇష్టుడు, సన్నిహితుడైన షింజో హత్యవార్త తనను కలచివేసిందని ప్రధాని మోదీ అన్నారు.
భారత్ తో ఆయనకు ప్రత్యేక అనుబంధం, భారత్ ను ఎంతో ప్రేమిస్తారు షింజో. షింజో తాత కూడా జపాన్ ప్రధానిగా పనిచేశారు. రెండో ప్రపంచ యుద్ధంలో తీవ్రంగా నష్టపోయిన జపాన్ ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయింది. ఆ సమయంలో ఆయన తాత, నాటి ప్రధాని నొబుసుకె కిషి భారత పర్యటనకు రాగా… నాటి భారత ప్రధాని నెహ్రూ ఎంతో సాదరంగా ఆహ్వానించారు. నాడు భారత్ ఇచ్చిన ఆతిథ్యం, ఇక్కడి ప్రజలు చూపిన ఆదరణ ఎన్నటికీ మరిచిపోలేనని పలుమార్లు ప్రపంచ దేశాల పర్యటన సందర్భంగా కిషి చెప్పుకున్నారు. అందుకే తన తాతకు ఎంతో ఇష్టమైన భారత్ అంటే నాకు మరింత అభిమానం అని షింజో కూడా పలు వేదికలపై ప్రకటించారు.
2006లో భారత్ కు వచ్చిన ఆయన సైతం మనదేశం చూపిన ఆదరాభిమానాలకు ఎంతో ఉద్వేగభరితులయ్యారు. నాటు పార్లమెంట్ ఉభయసభలనుద్దేశించి ప్రసంగించారు. నాడు ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతమే తరువాత ఇండో-పసిఫిక్ వ్యూహంగా రూపాంతరం చెంది చైనాకు చుక్కలుచూపిందని చెప్పవచ్చు. చైనా దుష్టపన్నాగాన్ని కొన్నేళ్లక్రితమే పసిగట్టిన షింజో …అమెరికా, ఆస్ట్రేలియా,భారత్, జపాన్ దేశాలతో బలమైన కూటమికి ప్రాణం పోశారు. చైనా దెబ్బకు భయపడి ఈశాన్యాన అరుణాచల్ ప్రదేశ్లో పెట్టుబడులకు ప్రపంచబ్యాంక్ సైతం వెనకడుగేస్తున్న తరుణంలో ఆయన ప్రధానిగా ఉండగానే 13వేల కోట్ల పెట్టుబడులకు ముందుకువచ్చింది జపాన్.తన ఎనిమిదేళ్ల పదవీకాలం ఏకంగా నాలుగుసార్లు భారత్ ను సందర్శించడం కూడా ఓ రికార్డేనని చెప్పవచ్చు. ముఖ్యంగా మోదీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడ్డాక జపాన్, భారత్ బంధం మరింత బలపడింది. ఆయన శిష్యులే తరువాత ప్రధానులు కావడంతో జపాన్ తో భారత్ బంధం మరింత దృఢపడింది.
https://twitter.com/narendramodi/status/1545335314977538048?s=20&t=oVzx6VeWmCaJ4-CUlbeBUg