హర్యానా మాజీ కాంగ్రెస్ నేత కుల్దీప్ బిష్ణోయ్ ఈరోజు న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీలో చేరారు. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఆయనను పార్టీలోకి స్వాగతం పలికారు. జూన్ 10న జరిగిన రాజ్యసభ ఎన్నికలలో BJP మద్దతుగల స్వతంత్ర అభ్యర్థికి అనుకూలంగా క్రాస్ ఓటు వేసినందుకు కులదీప్ బిష్ణోయ్ ను కాంగ్రెస్ పార్టీ నుంచి తొలగించారు.
కుల్దీప్ బిష్ణోయ్ ప్రధాని మోదీ నాయకత్వాన్ని బలపరిచారు. రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇచ్చారు. మేం ఆయన్ని స్వాగతిస్తున్నామని మనోహర్ లాల్ ఖట్టర్ అన్నారు. కుల్దీప్ భార్య రేణుకా బిష్ణోయ్ కూడా బీజేపీలోకి మారారు.
బిష్ణోయ్ విధానసభకు రాజీనామా చేస్తున్నట్లు నిన్న ప్రకటించారు. మాజీ కాంగ్రెస్ ప్రముఖుడైన భజన్ లాల్ కుమారుడు బిష్ణోయ్ 2007లో తన సొంత పార్టీ హర్యానా జన్హిత్ కాంగ్రెస్ (BL)ని స్థాపించినప్పుడు.. ఆయన్ని మొదటిసారి కాంగ్రెస్ బహిష్కరించింది. 2016లో తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి తిరిగి కాంగ్రెస్లో చేరారు.
కాంగ్రెస్ ఏప్రిల్లో హర్యానా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉదయభాన్ ను నియమించింది. అప్పటి నుంచి బిష్ణోయ్ కోపంతో ఏ కాంగ్రెస్ కార్యక్రమానికి హాజరుకాలేదు. కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్, రాష్ట్ర ఇంచార్జి వివేక్ బన్సాల్ సహా అందరూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలని పట్టుబట్టినా ఫలితం లేకపోయింది.