ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హర్యానా మాజీ ముఖ్యమంత్రి, ఇండియన్ లోక్ దళ్ చీఫ్ ఓం ప్రకాశ్ చౌతాలాకు ఢిల్లీ సీబీఐ ప్రత్యేక కోర్టు నాలుగేళ్ల జైలుశిక్ష, 50 లక్షల రూపాయల జరిమానా విధించింది. చౌతాలాకు చెందిన నాలుగు ఆస్తులను జప్తు చేయాలని కూడా న్యాయమూర్తి వికాస్ ధుల్ ఆదేశించారు. 1999 జులై 24 నుంచి 2005 మార్చ్ 5 మధ్య చౌతాలా, ఆయన కుటుంబ సభ్యులు 1,467 కోట్ల రూపాయలు కూడబెట్టడమే కాక, వేల ఎకరాల భూములు కబ్జా చేసినట్లు సీబీఐ విచారణలో తేల్చింది. 43 స్థిరాస్థులతో పాటు అక్రమంగా కూడబెట్టిన నగదు, నగల గురించి సీబీఐ ఎఫ్ఐఆర్లో పొందుపరిచింది. అనధికారిక లెక్కల ప్రకారం చౌతాలా అక్రమాస్తుల విలువ రూ. 6,09,79,026 రూ.గా అంచనా వేశారు. చౌతాలా కుమారులైన అభయ్ సింగ్, అజయ్ సింగ్లపై కూడా ఎఫ్ఐఆర్ దాఖలు చేసి విడిగా విచారణ జరిపారు. 2013 జనవరిలో ఢిల్లీ న్యాయస్థానం చౌతాలా ఆయన కుమారుడు అజయ్ సింగ్కు పదేళ్ల జైలు శిక్ష విధించింది. శిక్ష పూర్తి చేసుకుని 2021 జులై 2న చౌతాలా తీహార్ జైలు నుంచి విడుదలయ్యారాయన.