ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని సృష్టించిన ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం కారణంగా భారతదేశ చమురు కొనుగోలుపై విమర్శలను విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తిప్పికొట్టారు. రష్యా నుంచి భారతదేశం చమురు దిగుమతులను సమర్థిస్తూ, ఉక్రెయిన్ వివాదం అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఎలా ప్రభావం చూపుతుందో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం అని డాక్టర్ జైశంకర్ మరీ ముఖ్యంగా చెప్పారు. యుద్ధం నేపథ్యంలో కూడా రష్యా నుంచి యూరప్ గ్యాస్ దిగుమతి చేసుకుంటుండగా భారత్ను మాత్రమే ఎందుకు ప్రశ్నిస్తున్నారని ప్రశ్నించారు.
రష్యా నుంచి భారత్ చమురు దిగుమతులు జరపడం ద్వారా ఉక్రెయిన్ యుద్ధానికి నిధులు సమకూర్చడం లేదా అనే ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ, తాను వాదించదలచుకోలేదని అన్నారు. స్లోవేకియాలో జరుగుతున్న GLOBSEC 2022 బ్రాటిస్లావా ఫోరమ్లో ఈ వ్యాఖ్యలు చేశారు.
భారతదేశం రష్యా చమురును దిగుమతి చేసుకోవడంపై డాక్టర్ జైశంకర్ మాట్లాడుతూ, యూరోపియన్ యూనియన్ విధించిన ఆంక్షల ప్యాకేజీలు కొన్ని యూరోపియన్ దేశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని విధించారని అన్నారు. కోవిడ్-19 మహమ్మారిని భారతదేశం వివేకంతో నిర్వహించిందని, ఆర్థికంగా పుంజుకునే బలమైన భావనతో దేశం కోవిడ్-19 నుంచి త్వరగా బయటపడిందని ఆయన అన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం మహమ్మారి సమయంలో ఆర్థిక వ్యవస్థను నిర్వహించడమే కాకుండా అనేక రంగాలలో.. ముఖ్యంగా డిజిటల్ పునర్నిర్మాణంలో ఎలా దూసుకుపోయిందో కూడా మంత్రి వివరించారు.
https://twitter.com/BrutIndia/status/1532730799509778433?s=20&t=urC4me6dPSWtGxrqoExthQ
జైశంకర్ ప్రస్తుతం స్లోవేకియా, Czech republic లలో ఐదు రోజుల పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటన రెండు మధ్య యూరోపియన్ దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలకు మరింత బలపరుస్తుంది. బ్రాటిస్లావా పర్యటన సందర్భంగా, ఆయన స్లోవేకియా ప్రధాన మంత్రి ఎడ్వర్డ్ హెగెర్ను కూడా కలుస్తారు. స్లోవేకియా విదేశాంగ, యూరోపియన్ వ్యవహారాల మంత్రి ఇవాన్ కోర్కోక్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. Czech republic పర్యటన సందర్భంగా ఆయన Czech republic విదేశాంగ మంత్రి జాన్ లిపావ్ స్కీతో చర్చలు జరుపుతారు.
వచ్చే నెల 1 నుంచి చెక్ రిపబ్లిక్ EU అధ్యక్ష పదవిని చేపట్టనుంది.
రెండు దేశాల రాజకీయ నాయకత్వాన్ని కలవడంతో పాటు.. జైశంకర్ స్లోవేకియా, Czech republicలోని భారతీయ విద్యార్థులతో కూడా సంభాషించనున్నారు.