హిందీ కోసం.. కొరియాలో విద్యార్థుల ఉద్యమం
ఎక్కడో దక్షిణ కొరియాలోని ఒక విశ్వవిద్యాలయంలో హిందీ బోధన కొనసాగించాలని విద్యార్థులు ఉద్యమిస్తున్నారు. దీనికోసం సామాజిక మాధ్యమాలనే వేదికగా చేసుకున్నారు. సియోల్ లోని భారత రాయబార కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ కు మొరపెట్టుకున్నారు. చివరకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి తమ ఆవేదనను తెలుపుతూ వీడియో సందేశాన్ని సోషల్ మీడియా ద్వారా పంపించారు.
కొరియాలోని బూసాన్ యూనివర్సిటీ ఆఫ్ ఫారిన్ స్టడీస్ లో హిందీ బోధనా విభాగం ఉంది. 1972 నుంచి ఈ విశ్వవిద్యాలయంలో హిందీ బోధన జరుగుతున్నది. ఇక త్వరలోనే హిందీ విభాగాన్ని రద్దు చేసే యోచనలో యూనివర్సిటీ ఉందని ఒక ప్రకటన వెలువడింది. దీంతో హిందీ విద్యార్థులు అభ్యంతరం చెప్తున్నారు. హిందీలో చదవడం ద్వారా సనాతన భారతదేశానికి చెందిన అద్భుతమైన వాస్తవాలను తెలుసుకోవచ్చనేది వారి ఉద్దేశం. కాబట్టి హిందీ విభాగాన్ని కొనసాగించాలని కొన్ని రోజులుగా ఉద్యమిస్తున్నారు.
భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో హిందీకి వ్యతిరేంగా విద్వేష పూరిత ప్రకటనలు చేసే వారున్నారు. హిందీ వద్దని ఆందోళన చేసే వారున్నారు. కానీ కొరియాలో మాకు హిందీ కావాలని విద్యార్థులు పట్టుబడుతున్నారు. వాళ్లను చూసి మనవాళ్లు చాలా నేర్చుకోవాలి.