అత్యాచారం కేసులో నిందితుడిపై దాఖలైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. బాధితురాలు, పిటిషనర్ల మధ్య కుదిరిన ఒప్పందం, ఇద్దరి వివాహం ఆధారంగా ఎఫ్ఐఆర్ ను కొట్టివేయలేమని స్పష్టం చేసింది.
ఓ ప్రభుత్వోద్యోగిపై ఐపీసీ సెక్షన్ 376, 323, 506 కింద నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్పై కోర్టు విచారణ చేపట్టింది. నిందితుడు తనపై దాడి చేశాడని…పెళ్లి గురించి మాట్లాడేందుకు వెళ్తే లైంగికదాడి చేశాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ జీవన్ సాతి.కామ్ ద్వారా తాను ఆ వ్యక్తిని సంప్రదించానని.. అప్పుడే తన ఫోన్ నెంబర్ ఇచ్చానని చెప్పింది. 32 ఏళ్ల ఆ వ్యక్తి తాను ఒంటరిని, అవివాహితుడిని అని నమ్మించాడని వాపోయింది. అతని భార్య ఆత్మహత్య చేసుకుందని ఆకేసు కోర్టులోనే ఉందని ఆమెకు తెలియడంతో అన్ని ఆధారాలతో కేసు పెట్టింది. కొంతకాలం అందరికీ తాను భార్యనని చెప్పాడని కానీ తన కుటుంబసభ్యులతో కలవనీయకుండా ఉంచాడని…పెళ్లి మాట దాటవేస్తూ తన కార్లో పలుమార్లు అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు చేసింది. అయితే కేసు జఠిలం కావడంతో నిందితుడు పోలీస్ స్టేషన్ కే పోలీసుల సమక్షంలో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. తరువాత ఆ ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ వేశాడు. సామరస్యపూర్వకంగా సమస్య పరిష్కారం అయిందని, పెళ్లి చేసుకున్నామని..ఎఫ్ఐఆర్ ను రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ వేశారు. అయితే అందుకు కోర్టు నిరాకరించింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు.
అత్యాచారం కేవలం వ్యక్తులపై చేసే దాడి మాత్రమే కాదని…సమాజిక వ్యతిరేక చర్య అని కోర్టు పేర్కొంది. కేసులో పిటిషనర్ ప్రభుత్వ ఉద్యోగి కస్టమ్స్, అండ్ సీజీఎస్టీ విభాగంలో ఉన్నాడు. సూపరింటెండెంట్ హోదాలో పనిచేస్తున్నాడు. గెజిటెడ్ హోదాలో బాధ్యతాయుతపదవిలో ఉండి తన వ్యక్తిగత జీవితంలో నైతికత కోల్పోయిన వ్యక్తిని ఎలా క్షమించగలం అని జస్టిస్ రజనీష్ భట్నాగర్ వ్యాఖ్యానించారు. బాధితురాలు, పిటిషనర్ మధ్య సెటిల్మెంట్ ఆధారంగా వారి నేరాన్ని మాఫీ చేయడం కుదరదని పిటిషన్ కొట్టివేస్తూ విచారణ కొనసాగుతుందని స్పష్టం చేసింది ధర్మాసనం.