ఉగ్రవాదానికి కీలకం ఆధారంగా ఉన్నఆర్థిక తోడ్పాటును బ్రేక్ చేయాలని జాతీయభద్రతా సలహాదారు అజిత్ దోవల్ అన్నారు. మధ్య ఆసియా దేశాలకు చెందిన ఎన్ఎస్ఏలు, అధికారులతోజరిగిన సమావేశంలో దోవల్ మాట్లాడారు. టెర్రర్ ఫైనాన్సింగ్ నిర్మూలనపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఉగ్రవాద ప్రచారం, నిధుల సేకరణ, సీమాంతర ఉగ్రవాదం, సైబర్ క్రైమ్స్, డ్రోన్ల ద్వారా మాదకద్రవ్యాలు, ఆయుధాల అక్రమరవాణా, ఫేక్ న్యూస్ వ్యాప్తి ఉగ్రవాద కట్టడి ప్రయత్నాలకు సవాళ్లుగా మారాయన్నారు. మధ్యఆసియా దేశాలకు భారత్ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్న ఆయన…వాణిజ్యం సహా అన్ని సంబంధాలను పరస్పరం బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.