తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. నియామక ప్రక్రియలో భాగంగా.. మొదటగా 30,453 పోస్టుల భర్తీకి ఆర్ధిక శాఖ అనుమతులిచ్చింది. శాఖల వారీగా ఉద్యోగ నియామకాలకు అనుమతిస్తూ జీవోను విడుదల చేసింది. సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినట్లుగా 80,039 పోస్టుల భర్తీకి గానూ మొదటి విడతలో 30,453 ఉద్యోగాలకు ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలిపింది ప్రభుత్వం. ఇతర శాఖల్లోని ఖాళీలపై త్వరలోనే ఆర్ధిక శాఖ అధికారులతో చర్చించి మిగతా ఉద్యోగాలకు కూడా అనుమతులు ఇస్తామని తెలిపింది ప్రభుత్వం. ముందు అనుకున్నట్లుగానే బోర్డుల ద్వారా నియామకం చేపట్టాలని నిర్ణయించింది. టీఎస్పీఎస్సీ ద్వారా 503 గ్రూప్ 1 పోస్టులు.. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 16587 ఖాళీలు భర్తీ చేయనుంది. హెల్త్ డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి 10,028 పోస్టులు.. టీఎస్పీఎస్సీ ద్వారా హెల్త్ డిపార్ట్మెంట్ లో 2,662 ఖాళీలను.. డీఎస్సీ బోర్డు ద్వారా 45 పోస్టులను భర్తీ చేస్తామని తెలిపింది ప్రభుత్వం.