త్వరలో కాంగ్రెస్కు మరో బిగ్ షాక్..? కమలం గూటికి మైనార్టీ కీలక నేత ఫిరోజ్ ఖాన్..?
కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే పార్టీకి చెందిన అగ్రనేతలంతా గుడ్బై చెప్తున్నారు. అంతేకాదు.. వారంతా కమలం గూటికి చేరడం పార్టీకి మింగుడుపడటం లేదు. తాజాగా కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పి కమలం గూటికి చేరుకున్న సంగతి తెలిసిందే. అంతకు ముందు మాజీ ఎంపీ విజయ శాంతి కూడా హస్తంకు రాజీనామా చేసి బీజేపీ కండువా కప్పుకున్నారు. ఇలా ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీని వీడుతూ.. కమలం గూటికి చేరుతున్నారు. ఇదంతా ఇలావుంటే ఇప్పుడు మరో వార్త కాంగ్రెస్ శ్రేణుల్లో గుబులు రేపుతోంది.
పార్టీలో కీలకంగా ఉన్న మైనార్టీ నాయకుడు ఫిరోజ్ ఖాన్ కూడా పార్టీ వీడుతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్లుగా ఆయన పలు ఇంటర్వ్యూల్లో కూడా బీజేపీపై సానుకూలంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. “Myind Media”కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కూడా హైదరాబాద్ ఎంపీగా ఇస్తే బీజేపీలో చేరుతానంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఆయన బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేసిన సర్జికల్ స్ట్రైక్ వ్యాఖ్యలను సమర్థించారు. మొన్న జరిగిన ఛత్రపతి శివాజీ జయంతి వేడుకల్లో కూడా ఆయన దర్శనమిచ్చారు. ఇవన్నీ చూస్తుంటే ఫిరోజ్ ఖాన్ కూడా కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పి త్వరలోనే కాషాయ కండువా కప్పుకునేలా ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి.