వీర విధేయులకు విందు అదుర్స్!
తెలంగాణలో ఉన్న సచివాలయాన్ని కూల్చిన సిఎం కెసిఆర్ అధికారిక భవనానికి ప్రగతి భవన్ అనే పేరుపెట్టి కోటలా మార్చారు. తనను తానే జైల్లో బంధించుకున్నారని కూడా అప్పుడప్పుడూ గిట్టని వారు అంటారనుకోండి. అందుకే ప్రగతి భవన్ దిగ్బంధం అని పిలుపుఇస్తే సక్సెస్ అవుతుందంటారు. ఎందుకంటే పోలీసులే దాన్ని అష్టదిగ్బంధనం చేస్తారు. ఆ భవనంలో 2020 ఏడాది చివరి రోజు ఓ మాంచి దావత్ జరిగింది. ఉద్యోగ సంఘాల నేతలు అనే కెసిఆర్ వీర విధేయులకు అదిరిపోయ విందు ఇచ్చారు. ఘుమఘుమలాడే వంటకాలతో, దిల్ పసంద్ డిషెస్ తో జీవితాంతం గుర్తుండి పోయే దావత్ ఇచ్చారు. టీఎన్జీవో, గెజిటెడ్ అధికారుల సంఘాల వారికి మాత్రమే ఆ కోటలాంటి భవనంలో ప్రవేశం. ఉపాధ్యాయులు కూడా ప్రభుత్వ ఉద్యోగులే అయినా వాళ్లు చైతన్యవంతులు కాబట్టి నో ఎంట్రీ. ప్రభుత్వ డాక్టర్ల సంఘ ప్రతినిధులకు గానీ, పోలీసు సంఘ ప్రతినిధులకు గానీ పిలుపు లేదు.
వేతనాల పెంపు, రిటైర్మెంట్ వయసు పెంపు అనే వరాలను ప్రకటించిన కనిపించే దేవుడు కెసిఆర్ కు చేతులెత్తి దండం పెట్టి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమాన్ని బాగానే రక్తి కట్టించారట. మీటింగ్ అని పిలుపు వచ్చిందన్నారు. కానీ అది కేవలం దావత్ పిలుపు మాత్రమే అని తర్వాత తెలిసింది. డైరా ఆవిష్కరణ, క్యాలెండర్ లాంచింగ్ అనే అదనపు ఆకర్షణలతో దావత్ ముగిసింది. ఆరున్నర ఏళ్లుగా ప్రమోషన్లకు నోచని వాళ్లకు, తమను రెగ్యులర్ చేస్తారని ఆశపడిన కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మరోసారి నిరాశ తప్పలేదు. కెసిఆర్ జమానా మొదలైన తర్వాత సర్కారీ కొలువుపై యువత నీల్లాడిచ్చి దండం పెట్టినట్టే ఉంది పరిస్థితి. ఉద్యోగ సంఘాల నేతలపై ఈ మధ్య భారీగా విమర్శలు వచ్చాయి. వాళ్లు టిఆర్ ఎస్ కార్యకర్తలుగా మారారని , కెసిఆర్ కు చెంచాలు అయ్యారనే ఆరోపణలు వచ్చాయి. బాధ్యత గల ఉద్యోగులపై ఇలాంటి విమర్శలు రావడం బాధాకరం. అయితే తాము కడిగిన ముత్యం వంటి వాళ్లమని ఉద్యోగుల నేతలు నిరూపించుకునే ప్రయత్నం కూడా చేయడం లేదు. సీఎం ప్రాపకం పొందితే అదే పదివేలు అనుకుంటున్నారనే విమర్శలు ఆగటం లేదు.
నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో కొట్లాడి సాధించుకున్న రాష్ట్రం తెలంగాణ. ఎత్తిపోతల పథకాలతో ఏపీ మన వాటా కృష్ణా నీటిని తరలించుకుపోతున్నా కెసిఆర్ పట్టించుకోవడం లేదనే ఆరోపణ ఇప్పటికే ఉంది. నిధుల విషయానికి వస్తే ఖజానా దాదాపుగా ఖాళీ. నియామకాలు పెద్దగా లేవు. మరి ఉద్యోగ సంఘాల నేతలు పోటీపడి సీఎంను ఎందుకు పొగుడుతున్నారు అనే విపక్షాల ప్రశ్నకు జవాబు లేదు. ఉద్యోగులు కాబట్టి పాలకులకు విధేయులుగా ఉంటే తప్పేంటనేది మరో వాదన. వీర విధేయులకు విందు ఇవ్వడం తప్పుకాదనే సమర్థన కూడా వినవస్తోంది. మరి ఉపాధ్యాయులు ఉద్యోగులు కారా అంటే మాత్రం జవాబు లేదు.