ఉన్నత విద్యావంతుడైన తండ్రి ఆ బిడ్డ గురించి ఎన్నో కలలు గన్నాడు. భారతీయ సంస్కృతి ఏమాత్రం ఒంటబట్టకుండా జాగ్రత్త పడ్డాడు. అసలు భారతీయుడిగా కాక…ఓ ఇంగ్లిష్ బిడ్డలా తనను తీర్చిదిద్దాలనుకున్నాడు. పసిప్రాయంలోనే దాన్ని ఆచరణలో పెట్టాడు. ఏమీ తెలియని వయసులో దేశాంతరం పంపాడు. అయితే తండ్రి ఆకాంక్ష, ఆలోచనలకు విరుద్ధంగా ఎదిగాడు. తెల్లదొరలా కోటు వేసుకుని కలెక్టర్ గా కొడుకుని చూడాలని తండ్రి సంకల్పిస్తే… స్వాతంత్య్ర సమరయోధుడిగా మారి తెల్లదొరలకు చుక్కలు చూపాడాకొడుకు. అతడే అరవింద ఘోష్.
బెంగాల్లోని సంపన్న కుటుంబంలో పుట్టిన అరబిందుడికి భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు, భాషాసాహిత్యాలు, పురాణేతిహాసాలు ఏవీ ఒంటబట్టవద్దనుకున్నాడు డాక్టర్ అయిన ఆయన తండ్రి కృష్ణధన్ ఘోష్. ఏడేళ్ల పసిప్రాయంలోనే అరవిందుడు సహా ముగ్గురు కొడుకుల్నీ ఇంగ్లండ్ పంపించేశాడు. అక్కడే ఉన్నత చదువుల వరకూ చదివించి ఇండియన్ సివిల్ సర్వీస్ కోర్సులో చేరాలని ఆశించాడు. ఐసీఎస్ పరీక్షల్లో ఉత్తీర్ణుడైన అరవిందుడికి అందులో చేరడం ఇష్టం లేదు. పోటీలో భాగంగా గుర్రపు స్వారీకి వెళ్లాల్సి ఉండగా…కావాలని ఆలస్యంగా వెళ్లి పోటీ నుంచి తప్పుకున్నాడు. అప్పటికే ఇంగ్లిష్, లాటిన్, ఫ్రెంచ్, ఇటాలియన్ భాషలపై పట్టు పెంచుకున్నాడు. వివిధ భాషా గ్రంథాల్ని అధ్యయనం చేస్తున్న క్రమంలో భారతీయ సాహిత్యం పై ఆయన దృష్టి పడింది. సాహిత్యం ద్వారా భారతీయ సాంస్కృతిక విలువలు ఆయనకు అర్థం అయ్యాయి. అప్పుడే దేశంలో బ్రిటీష్ వలస పాలకులకు వ్యతిరేకంగా జరుగుతున్న స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొనాలని బలంగా అనుకున్నాడు.
అదే సమయంలో బెంగాల్ విభజన దేశంలోని యువతరాన్ని జాతీయవాదంవైపు ప్రేరేపించింది. అప్పుడే బెంగాల్ వెళ్లిన అరవింద్ఘోష్ నేషనల్ కాలేజ్ ఆఫ్ కలకత్తాలో ప్రిన్సిపల్గా చేరారు. బ్రిటన్ వలసవాద సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఇంగ్లాండు, ఫ్రెంచ్, ఇటలీ, అమెరికాల్లో జరిగిన తిరుగుబాట్లు, విప్లవ చరిత్రల అధ్యయనంతో ప్రభావితుడై బెంగాల్ప్రెసిడెన్సీలో రహస్య విప్లవకారులను ప్రేరేపించారు. ‘వందేమాతరం’ సంపాదకుడిగా పత్రిక సర్క్యులేషన్ దేశమంతా విస్తరింపచేశారు. ‘అనుశీలన సమితి’ పేరుతో యువజన క్లబ్లు ఏర్పాటు చేశారు. సంస్కృతం సహా ఇతర భారతీయ భాషలనూ నేర్చుకుని భారతీయ పురాణేతిహాసాలు, సాంస్కృతిక మూలాలు, చరిత్రను అధ్యయనం చేశారు.
స్వేచ్ఛా వాయువుల కోసం అతివాద, మితవాద గ్రూపులుగా సమరయోధులు పోరాటం సాగిస్తున్న సమయం. కింగ్స్ ఫోర్డ్ అనే జడ్జి సమరయోధులపై కక్షగట్టి క్రూరమైన శిక్షలు విధిస్తున్నారు. అప్పుడే ఖుదీరాం బోస్, ప్రపుల్ల చాకీలు ఆ జడ్జిపై హత్య చేయాలనుకున్నారు. అతను వెళ్లే గుర్రం బగ్గీపై వేయాల్సిన బాంబు గురితప్పి మరో బండిపై పడింది. అందులో ప్రయాణిస్తున్న బ్రిటిష్ మహిళలు చనిపోయారు. ఆ కేసులో అరవింద్ ఘోష్ను కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అలీపూర్ కుట్ర కేసుగా ఆ ఘటన ప్రసిద్ధి చెందింది. జైలు జీవితం ఆయన ఆలోచనల్ని మార్చివేసింది. మరింత పరిణతిని తీసుకువచ్చింది. అంత వరకు భారతీయ చరిత్ర, సంస్కృతిని అధ్యయనం చేసిన ఆయన దృష్టి ఆధ్యాత్మికత వైపు మళ్లింది. ఆ అనుభూతి ధ్యానయోగం వైపు సాగింది. యోగసాధనకు తగిన ప్రదేశాన్ని వెదుక్కుంటూ 1910లో పుదుచ్చేరి చేరారు అరవిందులు. 1926లో అక్కడే అరవింద ఆశ్రమాన్ని స్థాపించారు. కర్మయోగి, సావిత్రి, ధర్మ లాంటి అనేక గ్రంథాలు రాసి ప్రచురించారు. ఆధ్యాత్మిక సాధనలో ఉంటూ స్వాతంత్య్ర అనంతరం 1950లో ఆయన తన దేహాన్నివీడారు. అలా పసిప్రాయంలోనే అరవింద ఘోష్ను ఇంగ్లాండు పంపించి 14 ఏండ్లు ఇంగ్లిష్ చదువులు చదివించి… తెల్లదొరలా తన కొడుకును చూడాలనుకుంటే….చివరకు తను స్వాతంత్య్ర యోధుడిగా, విద్యావేత్తగా, ఆధ్యాత్మికవేత్తగా…చివరకు యోగిగా మారిపోవడం దైవనిర్ణయం, కర్మఫలమే తప్ప యాదృచ్ఛికం కాదు.

file photo