మరింత వేగవంతం.. అన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా వ్యాక్సిన్..!
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ మరింత వేగం పుంజుకుంటుంది. ఇప్పటికే తొలివిడతగా ఫ్రంట్లైన్ వారియర్స్కు వ్యాక్సిన్ ఇవ్వగా.. మార్చి 1వ తేదీ నుంచి రెండో విడత ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే రెండో విడతలో 60 ఏళ్ల పైబడ్డ వారితో పాటుగా.. 45 ఏళ్లపై పైబడ్డ వారు దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బందులు పడేవారికి మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. అయితే దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగం పెంచాలంటే వ్యాక్సినేషన్ కేంద్రాలను పెంచాలన్న డిమాండ్ వినిపించింది. ఈ క్రమంలో వ్యాక్సిన్ను దేశంలోని అన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో వ్యాక్సినేషన్ కేంద్రాలుగా వినియోగించుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది. ఆయుష్మాన్ భారత్, సీజీహెచ్ఎస్ వంటి కేంద్ర పథకాలు, రాష్ట్ర బీమా పథకాల పరిధిలోకి రాని ఆస్పత్రులను కూడా ఉపయోగించుకోవచ్చని తెలిపింది.
కాగా, వ్యాక్సిన్ కోసం కొవిన్ పోర్టల్లో ఇప్పటివరకు 50 లక్షల మందికిపైగా నమోదు చేసుకున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఇక ఇప్పటి వరకు ప్రధాని నరేంద్ర మోదీతో పాటుగా.. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రులు హర్షవర్ధన్, రాజ్నాథ్సింగ్, రవిశంకర్ ప్రసాద్, ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా, మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు, ప్రముఖ నటుడు కమల్హాసన్తో పాటు పలువురు వ్యాక్సిన్ తీసుకున్నారు.