బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు మాజీ మంత్రి కే తారక రామారావుకు ఫామ్ హౌస్ కేసు తలనొప్పిగా మారింది. ఈ కేసులో కేటీఆర్ దగ్గర బంధువుల మీద కేసులు నమోదు అవుతున్నాయి. ఫామ్ హౌస్ లో జరిగిన పార్టీ మీద భిన్నమైన వాదనలు వినిపిస్తున్నారు.
రోజంతా టెలివిజన్ చర్చలలో ఈ అంశం మీదనే వాదోపవాదనలు చోటుచేసుకున్నాయి. రాజకీయపరమైన విధానాల మీద పార్టీలు తలపడుతుంటాయి. కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కొంతకాలంగా వ్యక్తిగతమైన అంశాల పట్ల కూడా తీవ్రమైన విభేదాలు కనిపిస్తున్నాయి. దీంతో రాజకీయ పార్టీలు ఏ అంశాన్ని విడిచి పెట్టకుండా ప్రత్యర్థుల మీద దాడి చేస్తున్నాయి. ఫామ్ హౌస్ కేసులో కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి అన్నట్లుగా పరిస్థితి ముదురుతోంది. కేటీఆర్ దగ్గర బంధువు రాజ్ పాకాల ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగ సిద్ధం చేస్తున్నారు.
బీఎన్ఎస్ఎస్ 35(3) సెక్షన్ ప్రకారం రాజ్ పాకాలకు నోటీసులు జారీ చేసినట్లు మోకిల పోలీసులు వెల్లడించారు. జన్వాడలోని ఫామ్హౌస్లో జరిగిన పార్టీకి సంబంధించిన విషయాలపై విచారించాల్సి ఉందని, ఇవాళ విచారణకు రావాలంటూ అందులో పేర్కొన్నారు. అడ్రస్ ఫ్రూఫ్తో పాటు కేసుకు సంబంధించిన ఆధారాలను సైతం సమర్పించాలని సూచించారు. విచారణకు రాకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసులకు అందుబాటులోకి రాకపోవడంతో రాయదుర్గంలోని ఓరియన్ విల్లాస్లో మోకిల ఇన్స్పెక్టర్ పేరుతో ఉన్న నోటీసులను రాజ్ పాకాల నివాసానికి అతికించారు.
పోలీసుల ప్రయత్నాలను పసిగట్టిన కేటీఆర్ వర్గం ముందస్తు జాగ్రత్తలు మొదలుపెట్టింది.
ఈ నేపథ్యంలో రాజ్ పాకాల హైకోర్టును ఆశ్రయించారు. అత్యవసర పిటిషన్ దాఖలు చేయగా పోలీసులు అక్రమంగా కేసులు ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. తనను అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో కోరారు. భోజన విరామం తర్వాత జస్టిస్ విజయ్సేన్ రెడ్డి దీనిపై విచారణ చేపట్టారు. పోలీసుల ముందు హాజరుకావడానికి 2 రోజుల సమయం ఇచ్చారు. ఈ సమయంలోగా పోలీసుల ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించారు.
మొత్తం మీద రాజు పాకాల అరెస్టు తప్పదు అని టాక్ వినిపిస్తోంది. ఈ కేసులో ఒకరిద్దరిని అప్రూవల్ గా మార్చేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నం విజయవంతం అయితే కేటీఆర్ సన్నిహితులు కేసులో బాగా ఇరుక్కునే అవకాశం కనిపిస్తుంది.