హెలికాఫ్టర్ ప్రమాదంలో కన్నుమూసిన త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ కు యావత్ దేశం అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు పలికింది. ఢిల్లీలో జరిగిన రావత్ అంతిమ యాత్రలో వేలాదిమంది పాల్గొన్నారు. దారిపొడవునా జనం నిలబడి ఆ వీర సైనికుడికి నీరాజనాలు పలికారు. కడచూపు చూసుకున్నారు. వందేమాతరం, రావత్ అమర్ రహై, ఇండియన్ ఆర్మీ జిందాబాద్ నినాదాలతో దేశరాజధాని వీధులు మార్మోగాయి.
నిండా పూలతో అలంకరించిన ఆర్మీవాహనంలో భౌతికకాయం కామరాజ్ మార్గ్ లోని ఆయన నివాసం నుంచి బయల్దేరింది. కంటోన్మెంట్ బ్రార్ స్క్రేర్ శ్మశాన వాటికలో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి.
అంతకుముందు రావత్, మధులిక దంపతులకు సహా అమరవీరులకు ప్రముఖులు నివాళి అర్పించారు. ప్రధానిమోదీ, భద్రతాసలహాదారు అజిత్ దోవల్ సహా పలువురు ఆయన భౌతికకాయంపై పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. సైనిక సింహానికి సెల్యూట్ చేశారు.
అంత్యక్రియలకు ముందు గౌరవ సూచకంగా 19 తుపాకులు వందనం చేశాయి. త్రివిధ దళాల అధిపతులూ అంతిమ యాత్ర ఆసాంతం కదిలారు. 33 మంది ట్రై సర్వీస్ బ్యాండ్ జనరల్ అంతిమ యాత్రలో పాల్గొంది. రేర్ ఎస్కార్టుగా మరో 99 మంది సిబ్బంది యాత్రలో పాల్గొన్నారు. మొత్తం 800 సర్వీస్ సిబ్బంది బిపిన్ రావత్ దంపతుల యాత్రలో ఉన్నారు. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సహా డి ఆర్ డి ఓ చీఫ్ సతీష్ రెడ్డి చీఫ్ సతీష్ రెడ్డి, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, శ్రీలంక ఆర్మీ చీఫ్ షవేంద్ర సిల్వ , నేపాల్, బంగ్లాదేశ్ ఆర్మీకమాండర్లూ రావత్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.