5 రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో బిజీ అయ్యారు మోదీ. బహిరంగ సభల వేదిగ్గా విపక్షాలను లక్ష్యంగా విరుచుకుపడుతున్నారు. కుటుంబ పార్టీలు బీజేపీకి ఎప్పుడూ పోటీ కాబోవని…తమ పార్టీతో అవి ఎన్నటికీ తలపడలేవని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ప్రతిపక్షాలు ఏకం కావడం సహజమేనని అయితే ఓటర్ల తీర్పు ఎన్నికల్లో కీలకమని ఆయన అన్నారు.
కాంగ్రెస్, తృణమూల్, టీఆర్ఎస్ పార్టీలకు ప్రజాస్వామ్యమంటే ప్రజల ప్రభుత్వం కాదని…కుటుంబ పాలన అని ఆరోపించారు. రాష్ట్రాల పట్ల తాము వివక్షతో వ్యవహరిస్తున్నామన్న విమర్శల్లో పస లేదన్నారు. రాష్ట్రాలు అభివృద్ధి చెందనిదే దేశం అభివృద్ధి చెందబోదని, అందుకే సాధ్యమైనంత మేరకు రాష్ట్రాలను కలుపుకుపోతున్నామని ఓ రాష్ట్రానికి సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని తానని మోదీ వ్యాఖ్యానించారు.
నిజాయితీతో పన్ను చెల్లించేవారి ప్రయోజనాలను కాపాడేందుకు పలు చర్యలు చేపట్టామని మోదీ అన్నారు.
ఎనిమిదేళ్ల క్రితంతో పోలిస్తే చాలామంది నిజాయతీగా పన్నులు కడుతున్నారన్నారు. 2014లో రూ.5 లక్షల ఆదాయం ఉన్నవారు రూ. 13,000 పన్ను చెల్లించేవారని ఇప్పుడు వారు ఎలాంటి పన్నూ చెల్లించనవసరం లేదని అన్నారు. రూ.15 లక్షల ఆదాయం ఉన్నవారు చెల్లించాల్సిన పన్ను రూ.66 వేలకు తగ్గిపోయిందని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక నిత్యావసరాల ధరలు తగ్గాయని గుర్తు చేశారు.
అప్పుడు ద్రవ్యోల్బణం పది శాతం ఉంటే ఇప్పుడు ఆరు శాతానికి పడిపోయిందన్నారు. వ్యవసాయ రంగానికి తాము ఎంత చేశామో రైతులకు తెలుసని…ఎన్నికలు జరుగుతున్న ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్ రైతులు బీజేపీ వైపే మొగ్గు చూపుతున్నారనీ అన్నారు.
ఇక ముస్లిం మహిళల మద్దతు కూడా మాకేనంటూ ఆశాభావం వ్యక్తం చేశారు ప్రధాని. ఉత్తరప్రదేశ్ ముస్లిం మహిళలు తమ వెంటే ఉన్నారన్నారు. ట్రిపుల్ తలాక్ పేరుతో ఎందరో యువతులు, మహిళల జీవితాలు నాశనం అయ్యాయని…తాము తీసుకువచ్చిన చట్టం వాళ్ల జీవితాల్లో వెలుగు నింపుతోందని అన్నారు. ఐదురాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం కూడా నిర్వహిస్తున్న మోదీ బహిరంగ సభలు వేదిగ్గా విపక్ష పార్టీల తీరును ఎండగడుతున్నారు.
యూపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కాన్పూర్ దెహాత్లో నిర్వహించిన బహిరంగ సభలో మోదీ మాట్లాడారు. గతంలో ముస్లిం ఆడబిడ్డలు పాఠశాలకు వెళ్లాలంటే ఆకతాయిల నుంచి ఎన్నో సమస్యలు ఎదుర్కొనేవారని..బీజేపీ యోగీ సర్కారు ఏర్పడిన తరువాత వారు ధైర్యంగా ఎక్కడికైనా వెళ్లగలుగుతున్నారని అన్నారు. పంజాబ్లోని జలంధర్లోనూ ప్రధాని సోమవారం ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈసారి పంజాబ్లో వచ్చేది బీజేపీ కూటమి ప్రభుత్వమేనని మోదీ ధీమా వ్యక్తం చేశారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)