ప్రతి జిల్లాలో ఫ్యామిలీ కోర్టులను ఏర్పాటు చేయాలని న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్ని రాష్ట్రాలను కోరారు. ఫ్యామిలీ కోర్టుల ముందు విచారించే అంశాలు సున్నితమైనవి, ఎంతో జాగ్రత్త అవసరమని చెప్పిన కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు, 10 లక్షలకు పైగా జనాభా ఉన్న అన్ని జిల్లాల్లో ఫ్యామిలీ కోర్టులను ఏర్పాటు చేసేలా అన్ని రాష్ట్రాలకు లేఖ రాశామని నిన్న పార్లమెంటులో తెలిపారు. ఫ్యామిలీ కోర్ట్స్ అమెండ్ మెంట్ బిల్లుపై లోక్సభలో చర్చ సందర్భంగా ఈ ప్రకటన చేశారు.
ఈ బిల్లును సమర్థిస్తూ.. రిజిజు ప్రస్తుత ఫ్యామిలీ కోర్టుల సంఖ్య, పెండింగ్లో ఉన్న కేసుల డేటాను కూడా ఇచ్చారు.
లోక్సభకు ఇచ్చిన సమాధానం ప్రకారం, ప్రస్తుతం దేశంలో 715 ఫ్యామిలీ కోర్టులు ఉన్నాయి, ఏప్రిల్ 31 నాటికి 11,49,907 కేసులు పెండింగ్లో ఉన్నాయి. దేశంలో మొత్తం 773 జిల్లాలు ఉన్నాయి.
“ఏడాది మొదటి నుంచి మే వరకు 69,464 కొత్త కేసులు నమోదయ్యాయని నేను మీకు చెబుతున్నా” అని రిజిజు చెప్పారు.
జూలై 30న జరగనున్న అన్ని జిల్లాల జడ్జీల సదస్సులో పరిస్థితిని సమీక్షిస్తానని మంత్రి చెప్పారు. భారత ప్రధాన న్యాయమూర్తి, ప్రధానమంత్రి, దేశంలోని అన్ని జిల్లాల జిల్లా న్యాయమూర్తులు ఈ సదస్సులో పాల్గొంటారు.
“ఫ్యామిలీ కోర్టులో కేసులు చాలా సున్నితమైనవని.. వాటి పరిష్కారానికి ఎంతో జాగ్రత్త అవసరం. దీన్ని ఎలా చేయాలో ప్రభుత్వం పరిశీలిస్తోంది” అని రిజిజు చెప్పారు. ఫ్యామిలీ కోర్ట్స్ చట్టం ప్రకారం ప్రత్యేక ఫ్యామిలీ కోర్టుల ఏర్పాటు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుంది. 1984లో మొదటగా ఆమోదించిన ఫ్యామిలీ కోర్ట్స్ చట్టంలో సవరణ అవసరమని మంత్రి సమర్థించారు.
ఫ్యామిలీ కోర్టు కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేసేందుకు సాంకేతికతను, మధ్యవర్తిత్వాన్ని ఉపయోగించుకోవాలని ఆయన ఉద్ఘాటించారు. “చాలా కుటుంబ, వాణిజ్య కేసులను మీడియేషన్(మధ్యవర్తిత్వం) ద్వారా పరిష్కరించవచ్చు. మేం మీడియేషన్ బిల్లును కూడా తీసుకువస్తున్నామని రిజిజు తెలిపారు.