అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా నిరసనల పేరుతో హింస, కాల్పుల మధ్య తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నందుకు కేంద్రం 35 వాట్సాప్ గ్రూపులను నిషేధించింది. పథకం గురించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న వ్యక్తులపై ప్రభుత్వం నిఘా పెట్టింది. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటోంది.
అగ్నిపథ్ రిక్రూట్మెంట్ స్కీం గురించి వాట్సాప్ గ్రూపులు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయని.. దానికి వ్యతిరేకంగా హింసకు ఆజ్యం పోస్తున్నాయని.. మెసేజింగ్ గ్రూపులను నిషేధించడమే కాకుండా సాయుధ బలగాల రిక్రూట్మెంట్ స్కీం గురించి తప్పుడు వార్తలను వ్యాప్తి చేసినందుకు 10 మందిని అరెస్టు చేసినట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది.
అగ్నిపథ్ పథకం గురించి ఇలాంటి తప్పుడు వార్తలను వ్యాప్తి చేసే వ్యక్తులు లేదా గ్రూప్ గురించి తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. 8799711259 నంబర్ తో వాట్సాప్ ద్వారా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం గురించి PIB ఫ్యాక్ట్ చెక్ బృందానికి తెలియజేయాలని ప్రజలను కోరింది.
అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా జరిగిన హింసాత్మక నిరసనలు పక్కా ప్రణాళికతో కూడిన కుట్ర అని, దాని వెనుక అనేక కోచింగ్ సంస్థలు ఉన్నాయని ఇప్పటికే కనుగొన్నారు. బీహార్ పోలీసులు ఇప్పటికే కోచింగ్ ఇన్స్టిట్యూట్ల పాత్రపై దర్యాప్తు ప్రారంభించారు, అల్లర్లలో పాల్గొన్నందుకు అరెస్టయిన చాలా మందికి అలాంటి సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు వెల్లడించారు.