ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ఎంతటి డైనమిక్ అనేది వేరే చెప్పనక్కర లేదు. సమాజంలోని చీడపురుగులకు బుద్ధి చెప్పటానికి ఆయన బుల్ డోజర్ మార్గాన్ని ఎంచుకున్నారు. సమాజంలోని అల్లర్లకు పాల్పడేవారి అక్రమాలను లెక్క తీసి, వారి అక్రమ నిర్మాణాలను బుల్ డోజర్ లతో కూల్చివేస్తూ వచ్చారు. ఇప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కూడా ఇదే బాటలోకి వచ్చేశారు.
నాగపూర్ లో తాజా గా ఆపరేషన్ బుల్ డోజర్ ప్రారంభం అయిపోయింది. నాగపూర్ అల్లర్లకు సూత్రధారి అయిన ఫహీమ్ ఖాన్ చరిత్ర చూస్తే చాలా అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. యశోధర నగర్ లోని సంజయ్ బాగ్ కాలనీలో ఫహీమ్ ఖాన్ ఇల్లు ఒక అక్రమ నిర్మాణం అని అధికారులు లెక్క తేల్చారు. ఈ అక్రమ నిర్మాణంపై ఇప్పటికే నోటీసులు జారీ చేశామని, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినందువల్ల కూల్చేశామని అధికారులు తేల్చిచెప్పారు.
ఈ విషయంలో కొన్ని లీక్ లు ఇప్పటికే వచ్చాయి కూడా. కొన్ని రోజుల క్రితం ముఖ్యమంత్రి ఫడ్నవీస్ విలేకరుల సమావేశం నిర్వహించారు. యూపీ లాగా మహారాష్ట్రలో కూడా నాగపూర్ అల్లరి మూకల ఇళ్లపై బుల్డోజర్ యాక్షన్లు వుంటాయా? అని అడగ్గా… సమయం వచ్చినప్పుడు సరైన చర్యలు వుంటాయని ప్రకటించారు. ఈ ప్రకటన ఇచ్చి.. కొన్ని రోజుల తర్వాతే ముఖ్యమంత్రి కఠిన చర్యలకు ఉపక్రమించారు.
నాగపూర్ హింసాకాండ వెనుక వున్న ముఖ్య సూత్రధారి (మాస్టర్ మైండ్) ఫహీమ్ షమీమ్ ఖాన్ (38) ని కొద్ది రోజుల ముందే పోలీసులు అరెస్ట్ చేశారు. మైనారిటీస్ డెమోక్రెటిక్ పార్టీ లో నాయకుడిగా వున్నాడు. హింస చెలరేగడానికి కొన్ని క్షణాల ముందు రెచ్చగొట్టే ప్రసంగం చేసిన వీడియోను కూడా పోలీసులు సంపాదించారు.అల్లర్లకు ఫహీమ్ ఖాన్ కుట్ర పన్నాడని, దాదాపు 100 మందిని ఇందు కోసం సమీకరించాడని, చివరికి హింసకు దారి తీసిందని పోలీసులు తమ ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. అలాగే గణేష్ పేట్ పోలీసుల ముందే రెచ్చగొట్టే నినాదాలు చేసిన వీడియో కూడా లభించినట్లు తెలుస్తోంది. అలాగే పుకార్లను వ్యాప్తి చేశాడని కూడా పోలీసుల ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం.
మొత్తం మీద మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా తనదైన శైలిలో దూసుకొని వెళుతున్నారు. అందుకే నాగపూర్ అల్లర్లకు సంబంధించి సీరియస్ గా స్పందించారు. ప్రజల మాన ప్రాణాలతో ఆటలు ఆడే వ్యక్తులను సహించేది లేదని గట్టి సందేశాన్ని పంపించారు.