కేరళలో భారీగా పట్టుబడ్డ పేలుడు పదార్ధాలు..అది కూడా రైల్వే స్టేషన్లో..
గత కొద్ది రోజులుగా దేశంలో అనేక చోట్ల భారీగా మందుగుండు సామాగ్రి పట్టుబడుతుండటం కలకలం రేపుతోంది. తాజాగా కేరళలో భారీగా పేలుడు పదార్ధాలు పట్టుబడ్డాయి. అది కూడా రైల్వే స్టేషన్లో. వివరాల్లోకి వెళితే.. చెన్నై నగరానికి చెందిన ఓ మహిళా ప్రయాణికురాలు కోజికోడ్ రైల్వే స్టేషన్లో చెన్నై-మంగళూరు సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో ఎక్కింది. అయితే విధుల్లో భాగంగా రైల్వే ప్రోటెక్షన్ ఫోర్స్ తనిఖీలు చేపట్టింది. ఈ క్రమంలో సదరు మహిళపై అనుమానం వచ్చి చెక్ చేశారు. అయితే ఆమె కూర్చున్న సీటు కింద పేలుడు పదార్ధాలు ఉన్నట్లు గుర్తించారు. మొత్తం 100 వరకు జిలిటెన్ స్టిక్స్,350 డిటోనేటర్లను ఆర్పీఎఫ్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. అయితే వీటిని ఆ మహిళా ప్రయాణికురాలు తీసుకువచ్చిందా..? లేదా అంతకుముందే అక్కడ ఉన్నాయా..? అన్న కోణంలో విచారణ చేపడుతున్నారు. ప్రస్తుతం సదరు మహిళను ఆర్పీఎఫ్ కస్టడీలోకి తీసుకుంది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.