ఐదు రాష్ట్రాల ఎన్నికలు ప్రశాంతంగా ముగిసి ఫలితాలకు మరికొన్ని గంటలే ఉన్ననేపథ్యంలో సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఈవీఎంల అపహరణ జరిగిందని ఆయన ఆరోపించారు. వారణాసిలో స్ట్రాంగ్ రూం వెలువల సమాజ్ వాదీ మద్దతుదారులు నిరసనకు దిగారు. ఓట్లను మార్చే ప్రయత్నం చేశారని… వారణాసిలో కార్యకర్తలు ఈవీఎంలను తీసుకెళ్తున్న ట్రక్కును అడ్డుకున్నారన్నారు.
అయితే ఈవీఎంలు భద్రంగా ఉన్నాయని…పోలింగ్ అధికారులకు శిక్షణ కోసం వాటిని వారణాసి తీసుకెళ్తున్నట్టు చెప్పారు. పోలింగ్ లో ఉపయోగించిన ఈవీఎంలు సీలువేసి ఉన్నాయని…24 గంటలు వాటి పరిరక్షణలో సిబ్బంది ఉన్నారని రాష్ట్ర ఎన్నికలప్రధాన అధికారి తెలిపారు.
దీంతో హడావుడిగా లక్నోలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు అఖిలేష్ . రాష్ట్రంలోని అధికార యంత్రాంగం అవకతవకలు చేస్తోందని..ఓటరును మోసం చేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. బరేలీలో చెత్త పారేసే ట్రక్కు నుంచి మూడు బాక్సులు స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. సోన్భద్రలో తరలిస్తున్న ఈవీఎంలను స్థానికులు పట్టుకున్నారని అఖిలేష్ అన్నారు. బీజేపీ ఓడిపోతుంది అనుకున్న చోట్ల కౌంటింగ్ నిదానంగా జరిగేలా సాయంత్రం వరకూ జరగేలా చూడాలని… జిల్లా మెజిస్ట్రేట్ నుంచి పలువురికి కాల్స్ వెళ్లాలని ఆయన ఆరోపించారు.
అయితే అఖిలేశ్, విపక్షాల ఆరోపణల్ని కొట్టేశారు వారణాసి డీఎం కౌశల్ శర్మ. “ఒక పికప్ ట్రక్కులో 20 యంత్రాలు ఉన్నాయి, దానిని ప్రజలు ఆపింది నిజమే. పోలింగ్ ఈవీఎంలు రవాణా అవుతున్నాయా అని అక్కడి వాళ్లు కొందరు సందేహం వ్యక్తం చేశారు. దీంతో అభ్యర్థులు, న్యాయాధికారులను అక్కడికి పిలిపించాం. అయితే అవి శిక్షణ కోసం తీసుకెళ్తున్నయంత్రాలేనని నిర్థారించారు. అవి పోలింగ్ ఈవీఎంలతో అనుసంధానం కాలేదు. అసలైతే పోలింగ్ లో వినియోగించిన యంత్రాల హార్డ్ కాపీని అభ్యర్థులకు అందజేస్తారనే విషయం అందరికీ తెలుసు. చాలాచోట్ల ఈవీఎంలు లేకుండానే ట్రైనింగ్ నడుస్తోంది.ఎలాంటి అనుమానాలున్నా విచారణ చేయడానికి సిద్ధం’ అని అన్నారు.
అయితే, బ్యాలెట్ల రవాణాకు సంబంధించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదని అఖిలేష్ పేర్కొన్నారు. “ఈవీఎంలను శిక్షణ కోసం రవాణా చేస్తుంటే, అభ్యర్థులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదుని ఆయన ప్రశ్నించారు. ముజఫర్నగర్లో పనిచేస్తున్న రోజులనుంచి కౌశల్ శర్మ తనకు తెలుసని…బీజేపీ ప్రభుత్వం చెప్పినట్టే అతను చేస్తాడని అఖిలేష్ ఆరోపించారు. కౌశల్ శర్మ, కమిషనర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
విపక్షాల ఆందోళనలో అర్థం లేదని..కావాలని బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని అఖిలేష్ మండిపడుతోంది బీజేపీ. యూపీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సైతం ఓ ప్రకటన విడుదల చేస్తూ… “ఈ యంత్రాలను ఎప్పుడూ ప్రయోగాల కోసం, శిక్షణ కోసం మాత్రమే వినియోగిస్తున్నామని… పోలింగ్ లో వాడిన ఈవీఎంలకు సీల్ ఉంటుందని..వాటికి పటిష్ట భద్రత ఉంటుందని 24 గంటలూ మానిటర్ చేస్తూ ఉంటామని స్పష్టం చేశారు.