తనక కనీస ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తన భూముల్లో సర్వే చేశారంటూ మంత్రి ఈటల కుటుంబం వేసిన అత్యవసర పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. ఈటల భూముల్లో సర్వే జరిపిన తీరును కోర్టు తప్పుబట్టింది. సహజ న్యాయసూత్రాలను ఉల్లంఘిస్తూ కనీసనోటీసు ఇవ్వకుండా ఎలా సర్వే చేస్తారని ప్రభుత్వాన్ని, అధికారులను ప్రశ్నించింది. జమునా హేచరీస్ భూములు, వ్యాపారాల్లో జోక్యం కూడదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
తన నివాసంలో న్యామూర్తి జస్టిస్ వినోద్ కుమార్ విచారణ చేపట్టారు. ఈటల కుటుంబం తరపున న్యాయవాది దేశాయి ప్రకాశ్ రెడ్డి వాదనలు వినిపించారు. ఈటల భూముల్లోకి అక్రమంగా చొరబడ్డారని కోర్టుకు తెలిపారు. కలెక్టర్ నివేదిక కూడా తమకు ఇవ్వలేదన్నారు. అటు ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ ఏజీ ప్రసాద్ వాదనలు వినిపించారు. ఈటలపై తీవ్ర ఆరోపణలు వచ్చి, బాధితులు ఫిర్యాదు చేసినందునే విచారణ జరిపినట్టు చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం సర్వే చేసేందుకు నోటీసులు ఇవ్వాలిగా …అసలు రాత్రికి రాత్రే సర్వే ఎలా పూర్తైంది అని ప్రశ్నించారు. అధికారులు కార్లో కూర్చుని నివేదిక సిద్ధం చేశారనిపిస్తోందనీ కోర్టు వ్యాఖ్యానించింది. అయితే ప్రాథమిక విచారణ మాత్రమే జరిపినట్టు అడ్వొకేట్ జనరల్ బదులిచ్చారు. తదుపరి చర్యలు పూర్తి చట్టప్రకారం ఉంటాయన్నారు. అడ్వొకేట్ జనరల్ వాదనపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఈటల ఆస్తులు, వ్యాపారాల జోలికి వెళ్లవద్దని హెచ్చరిస్తూ స్టే ఇచ్చింది.