ఉత్తరప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం వృద్ధ సాధువులు, ఋషులు సహా పూజారుల ప్రయోజనాల కోసం పెద్ద అడుగు వేయబోతోంది. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న లోక్ కళ్యాణ్ సంకల్ప్ హామీకి అనుగుణంగా రాష్ట్రంలో ‘ప్రీస్ట్ వెల్ఫేర్ బోర్డు’ను ఏర్పాటు చేయాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. అదేవిధంగా రాష్ట్రంలోని మొత్తం 75 జిల్లాల్లో ‘ఎకో అండ్ రూరల్ టూరిజం’, ‘టూరిజం అండ్ కల్చర్ కౌన్సిల్స్’ కూడా ఏర్పాటు చేయనున్నారు.
రాష్ట్రంలోని ప్రజల విశ్వాసాన్ని గౌరవిస్తూ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వృద్ధ సాధువులు, ఋషులు, ఆలయాల పూజారుల సంక్షేమం కోసం బోర్డు ఏర్పాటు చేస్తారు. వారి సంక్షేమ పనులను బోర్డు చూస్తుంది.
బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే పురోహిత్ సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తానని అసెంబ్లీ ఎన్నికలకు ముందు యోగి ఆదిత్యనాథ్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, “మేము ‘పురోహిత్ కళ్యాణ్ బోర్డు’ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం. సంస్కృత విద్యార్థులందరికీ ప్రత్యేక స్కాలర్షిప్ లభిస్తుంది” అని అన్నారు.
వచ్చే 100 రోజుల్లో భక్తులు, పర్యాటకుల సౌకర్యార్థం ఆలయాలు, చరిత్ర, రూట్ మ్యాప్ వివరాలతో కూడిన ఆన్లైన్ ఇంటిగ్రేటెడ్ ఆలయ సమాచార వ్యవస్థను అభివృద్ధి చేయాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. ధార్మిక వ్యవహారాలు, పర్యాటకం, సంస్కృతి, భాషా శాఖలకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను మంత్రి మండలి ముందు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుధవారం సమీక్షించి ఆదేశాలిచ్చారు.
ప్రధాని నరేంద్రమోదీ మార్గదర్శకత్వంలో 21వ శతాబ్దంలో భారతదేశంలో సాంస్కృతిక పునరుజ్జీవనం జరుగుతోందన్నారు. రాష్ట్రం యొక్క ప్రత్యేక సాంస్కృతిక గుర్తింపును సంరక్షించడం, ప్రోత్సహించడం ద్వారా రాష్ట్రాన్ని సాంస్కృతిక గమ్యస్థానంగా స్థాపించడం మా ద్యేయం అని అన్నారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ, “ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, శ్రీ కాశీ విశ్వనాథ్ ధామ్ కారిడార్ నిర్మాణం, అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణం, అయోధ్య దీపోత్సవం, బ్రజ్ రంగోత్సవ్, కాశీ యొక్క దేవ్-దీపావళి వంటి ముఖ్యమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. వింధ్య ధామ్ కారిడార్, నైమిష్ తీర్థ, శుక్ తీర్థ పునరుజ్జీవనం, 100 సంవత్సరాల తర్వాత పునరుద్ధరించబడుతున్న మా అన్నపూర్ణ విగ్రహం, సోరోన్-సుకరక్షేత్ర అభివృద్ధి మొదలైనవి నూతన భారత్ ని ప్రతిబింబిస్తాయి అని అన్నారు.
రాష్ట్రంలో గుర్తించిన 12 సర్క్యూట్ల అభివృద్ధిని నిబద్ధతతో పూర్తి చేస్తామన్నారు. రామాయణ సర్క్యూట్, బౌద్ధ సర్క్యూట్, ఆధ్యాత్మిక సర్క్యూట్, శక్తిపీఠ్ సర్క్యూట్, కృష్ణ/బ్రాజ్ సర్క్యూట్, బుందేల్ఖండ్ సర్క్యూట్, మహాభారత సర్క్యూట్, సూఫీ సర్క్యూట్, క్రాఫ్ట్ సర్క్యూట్, ఫ్రీడమ్ స్ట్రగుల్ సర్క్యూట్, జైన్ సర్క్యూట్ సహా వైల్డ్ లైఫ్ అండ్ ఎకో-టూరిజం సర్క్యూట్ లు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి కొత్త గుర్తింపు ఇవ్వనున్నాయని యోగి అన్నారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)