తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు.. టీఆర్ఎస్ సీనియర్ లీడర్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. ప్రదీప్రావు బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలిసింది. ఈనెల 7న ఢిల్లీలో కేంద్ర మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ తో ఏర్పడిన విభేదాలు.. తన సోదరుడు టీఆర్ఎస్ లో కీలకంగా మారడం.. మంత్రివర్గంలో ఉండడంతో తనకు రావాల్సిన పదవులు, టికెట్లు రావడం లేదనే భావనలో ప్రదీప్ రావు ఉన్నట్టు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో టికెట్ ఆశించిన ప్రదీప్ రావును ఎమ్మెల్సీ పదవి ఇస్తామనే హామీతో టీఆర్ఎస్ అధిష్ఠానం బుజ్జగించింది. ఆ టికెట్ దక్కించుకున్న నన్నపునేని నరేందర్ ఎన్నికల్లో గెలిచారు. ఈ తరుణంలో టీఆర్ఎస్ లో తనకు గుర్తింపు ఇవ్వడం లేదనే కారణంతోనే ప్రదీప్ రావు పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసే విషయంలో అన్న ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అన్న వేరు.. అభిప్రాయాలు వేరని ప్రదీప్ రావు అన్నారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బృందం ప్రదీప్ రావుతో పలుసార్లు చర్చలు జరిపి పార్టీలో చేరికకు లైన్ క్లియర్ చేసినట్లు తెలిసింది. ప్రదీప్రావు ఇవాళ ముఖ్యమైన కార్యకర్తలతో చర్చల అనంతరం రాజీనామాను ప్రకటించే అవకాశం ఉంది.