ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేజ్రీవాల్, భగవంత్ మాన్ లు తెలంగాణ సీఎం కేసీఆర్ తో హైదరాబాద్ లో భేటీ అయ్యారు. అనంతరం ముగ్గురు కలిసి ప్రెస్మీట్ నిర్వహించారు. కేంద్రం తీరుపై మూకుమ్మడిగా విరుచుకుపడ్డారు. దేశంలో పరిస్థితులు ఎమర్జెన్సీ రోజులను తలపిస్తున్నాయని…కేంద్రం ఆగడాలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయని కేసీఆర్ వ్యాఖ్యానించారు. బీజేపీయేతర పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాలను కేంద్రం ఇబ్బందిపెడుతోందని ఆరోపించారు. గవర్నర్ వ్యవస్థపాలన ఎటు వెళ్తున్నదో తెలియడం లేదన్న కేసీఆర్…వంగివంగి కోతిదండాలు పెట్టినా కర్నాటక ప్రజలు బీజేపీని తిరస్కరించారని అన్నారు.కర్నాటక ప్రజలు చెప్పినట్టుగానే తెలంగాణ ప్రజలు కూడా ఆపార్టీకి గుణపాఠం చెప్పబోతున్నారని జోస్యం చెప్పారు. ఇక ఢిల్లీలోని తన ప్రభుత్వాన్ని కూడా మోదీ సర్కారు ముప్పుతిప్పలు పెడుతోందని కేజ్రీవాల్ ఆరోపించారు. కేసీఆర్ మద్దతుతో తమకు ధైర్యం వచ్చిందన్నారు. మోదీ సర్కారు ఆర్డినెన్స్ తీసుకువచ్చి డిల్లీ ప్రజలను అవమానించిందన్నారు.
కేంద్రం నిర్ణయంతో ఢిల్లీ సీఎంగా తాను కీలక నిర్ణయాలు తీసుకోలేపోతున్నానన్నారు. ఇక దేశ ప్రజల హక్కుల కోసమే తాము పోరాటం చేస్తున్నామని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ అన్నారు. బడ్జెట్ సమావేశాల నిర్వహణకు గవర్నర్ సహకరించడం లేదని..అందుకే సుప్రీంకు వెళ్లాల్సి వచ్చిందని వివరించారు..