ఎలన్ మస్క్ బ్లూటిక్ యూజర్లకు షాక్ ఇచ్చారు. డబ్బులు చెల్లించని వారికి వెరిఫికేషన్ మార్క్ను తొలగించడం మొదలుపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖుల ఖాతాల ట్విటర్ వెరిఫికేషన్ బ్యాడ్జ్లను తొలగించింది సంస్థ. ఇకపై నెలవారీ ప్రీమియం చెల్లించిన వారికి మాత్రమే వెరిఫైడ్ బ్లూ టిక్ మార్క్లను కొనసాగించనుంది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం బ్లూ టిక్ కోల్పోయారు. భారత్లోనూ పలువురు రాజకీయ ప్రముఖులు, పలు పార్టీల అధికారిక ఖాతాలకు బ్లూ టిక్ ను ట్విట్టర్ తొలగించింది. ముఖ్యమంత్రులు వైఎస్ జగన్, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, యోగి ఆదిత్యనాథ్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు , జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా సహా పలువురు రాజకీయ నాయకుల ఖాతాలకు ఇప్పుడు వెరిఫైడ్ మార్క్ కన్పించట్లేదు. బీజేపీ, కాంగ్రెస్ సహా పలు రాజకీయ పార్టీల అధికారిక ఖాతాలకు బ్లూ టిక్ ను ట్విట్టర్ తొలగించింది. రాజకీయ నాయకులే కాదు అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, దీపికా పదుకొణె, ఆలియాభట్, చిరంజీవి, క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సైనా నెహ్వాల్, సానియా మీర్జా, ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఖాతాలకూ వెరిఫికేషన్ బ్యాడ్జ్ తొలగించింది.
ట్విటర్ను కొనుగోలు తరువాత అనేక మార్పులు చేస్తూవస్తున్నారు ఎలన్ మస్క్. పలు సంచలన నిర్ణయాలూ తీసుకున్నారు.చాలామంది ఉద్యోగులను తొలగించగా..పలువురు సంస్థనే వీడారు. రెవెన్యూ పెంచుకునేందుకు బ్లూ టిక్కు సబ్స్క్రిప్షన్ తీసుకొచ్చారు. అనేక వాయిదాల తర్వాత బ్లూ టిక్ ప్రీమియం సేవలను ప్రారంభించారు. వెబ్ యూజర్లు నెలకు 8 డాలర్లు, ఐఫోన్, ఆండ్రాయిడ్ యూజర్లకు నెలకు 11 డాలర్లుగా నిర్ణయించారు. బ్లూ టిక్ యూజర్లకు ట్విట్టర్ లో తక్కువ యాడ్స్ కనిపిస్తాయి. అలాగే హై డురేషన్ వీడియోలను పోస్ట్ చేసుకునే అవకాశం కల్పించారు. ఇక తాజాగా డబ్బులు చెల్లించని వారికి ఖాతాలకు బ్లూ టిక్ తొలగించారు.