తెలంగాణలో రాజకీయం మరొకసారి వేడెక్కుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బిజెపి, బీఆర్ఎస్ పెద్ద ఎత్తున తలపడ్డాయి. అప్పటి అధికార బీఆర్ఎస్ పార్టీ ఓటమి చెందగా.. కాంగ్రెస్ పార్టీ గెలుపు సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. గతంతో పోలిస్తే ఎక్కువ సీట్లు తెచ్చుకొని బిజెపి బలపడింది. ఆరు నెలలు తిరగకుండానే పార్లమెంటు ఎన్నికలు రావడంతో కొంతకాలంగా మూడు పార్టీలు విపరీతంగా పని చేశాయి. ఈనెల 13న పార్లమెంటు ఎన్నికలకు పోలింగ్ ముగిసింది. వచ్చే నెల నాలుగో తేదీన ఓట్ల లెక్కింపు జరగబోతుంది.
ఇప్పుడిప్పుడే ఎన్నికల గొడవ నుంచి తేరుకుని పార్టీలు స్థిమిత పడుతున్నాయి.
ఈలోగానే మరోసారి ఎన్నికలు వచ్చి పడుతున్నాయి. తెలంగాణ అంతటా స్థానిక సంస్థలకు పదవీకాలం పూర్తి అయింది. దీంతో ఎన్నికలు తప్పనిసరి అవుతున్నాయి. ఇందుకోసం కసరత్తు మొదలవుతోంది.
జూన్ మొదటి వారంలో వార్డుల విభజన చేపట్టి, రెండవ వారంలో రిజర్వేషన్ ప్రక్రియ ను చేపడతారు.
మూడవ వారంలో సర్పంచ్ లకు రిజర్వేషన్ ప్రక్రియను ఒక కొలిక్కి తెస్తారు.
జులై మొదటి వారంలో షెడ్యూల్ విడుదల చేసి, చివరి వారంలో నోటిఫికేషన్ ఇచ్చేస్తారు.షెడ్యూల్ ప్రకారం
ఆగస్టు 10లోపు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తారు.
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 12,814 గ్రామపంచాయతీలు, 88,682 వార్డులకు ఎన్నికలు జరుగుతాయి.
మొత్తం మీద పార్టీలకు మరోసారి ఎన్నికల హడావుడి మొదలవుతోంది. దీంతో రాజకీయం బాగా వేడెక్కుతోంది.