ఎన్నికల పంచాయతీ: జగన్ కు ఎడాపెడా ఎదురుదెబ్బలు
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీంకోర్టు పచ్చజెండా చూపింది. ఈ సమయంలో ఎన్నికలు వద్దంటూ జగన్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈమేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ తో ప్రచ్ఛన్నయుద్ధంలో ప్రభుత్వం మరోసారి ఓడినట్టయింది. గత ఏడాది కరోనా ఉధృతి మొదలైన సమయంలో స్థానిక ఎన్నికలకు జగన్ సర్కార్ సై అంది. కానీ కరోనా కాలంలో ప్రజల ప్రాణాలను పణంగా పెట్టలేమంటూ ఎస్ ఇ సి ఎన్నికలను వాయిదా వేశారు. దీనిపై హైకోర్టులో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. కనోనా వేళ ఎన్నికలకు హైకోర్టే కాదు, సుప్రీంకోర్టు కూడా ఒప్పుకోదని చాలా మంది భావించిన వేళ, జగన్ ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానానికి వెళ్లింది. అక్కడా భంగపాటు తప్పలేదు.
ఆ తర్వాత ఎస్ ఇ సినే మార్చేయడానికి అనేక రకాలుగా కుయుక్తులను పన్నింది జగన్ సర్కార్. ఆగమేఘాల మీద నిబంధనల్ని మార్చేసి కొత్త ఎస్ ఇని నియమించడం, ఆయన ప్రమాణ స్వీకారం చేయడం చకచకా జరిగిపోయాయి. దీనిపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ న్యాయపోరాటం చేసి గెలిచారు. మళ్లీ ఎస్ ఇ సి గా వచ్చారు. అప్పటి నుంచీ జగన్ ప్రభుత్వంతో ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తున్నది. ఆయన పదవీ కాలం ముగిసే వరకు ఎలాంటి ఎన్నికలు వద్దనేది జగన్ ప్రభుత్వం వైఖరిగా ఉంది. అందుకే ఎప్పికప్పుడు రకరకాల కారణాలతో స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తూ వచ్చింది. ఈసారి మాత్రం నాలుగు విడతల ఎన్నికలకు నోటిఫికేషన్ కూడా శనివారం విడుదలైంది. సోమవారం స్టే వస్తుందని జగన్, ఆయన పార్టీ వారు గంపెడాశతో ఎదురు ఊశారు. కానీ నిరాశే ఎదురైంది.
విశేషం ఏమిటంటే, నిరుడు ఎన్నికలు కావాలన్న జగన్ ప్రభుత్వం న్యాయపోరాటంలో ఓడిపోయింది. ఇప్పుడు ఎన్నికలు వద్దంటూ న్యాయ పోరాటం చేసి మళ్లీ ఓడిపోయింది. పదే పదే రమేష్ కుమార్ దే పైచేయి అయింది. చివరకు ఉద్యోగ సంఘాలు కూడా ఎన్నికల విధుల్లో పాల్గొనేది లేదని చెప్పడం అనూహ్య పరిణామం. ఎన్నికల వేళ అధికార యంత్రాంగం ఎన్నికల కమిషన్ నియంత్రణలో ఉంటుంది. జగన్ సర్కార్ ఆదేశాలను అమలు చేయాల్సిన తప్పనిసరి పరిస్థితి ఉండదు. కాబట్టి హుందాగా, కొవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ ఎన్నికలకు సహకరించడం మంచిదని మేధావులు సూచిస్తున్నారు. ఇప్పటికే ఎన్నోసార్లు జగన్ సర్కార్ ఇగో కారణంగా కోర్టుల్లో మొట్టికాయలు చవిచూసింది. ఇకనైనా వాస్తవిక దృష్టితో పనిచేస్తే మంచిదని కూడా మేధావులు అభిప్రాయ పడుతున్నారు.